ఎగుమతిదార్లకు బాసటగా కేంద్రం చర్యలు | govt implemented several initiatives to boost exports | Sakshi
Sakshi News home page

ఎగుమతిదార్లకు బాసటగా కేంద్రం చర్యలు

Apr 8 2025 8:30 AM | Updated on Apr 8 2025 8:30 AM

govt implemented several initiatives to boost exports

అమెరికా టారిఫ్‌ల దెబ్బతో ఆందోళన చెందుతున్న ఎగుమతి సంస్థలకు బాసటగా నిల్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. కొత్త మార్కెట్లను అన్వేషించడంలో వాటికి మరింత తోడ్పాటు అందించనుంది. అలాగే, తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు అందేలా చూడటం, యూరోపియన్‌ యూనియన్‌తో పాటు బ్రిటన్, న్యూజిల్యాండ్‌ తదితర దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై చర్చలను వేగవంతం చేయడం తదితర చర్యలు తీసుకుంటోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

భారత్‌ నుంచి ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఆ్రస్టేలియా, బ్రెజిల్‌ లాంటి 20 దేశాలతో వరుసగా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలందినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఎగుమతి సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) సులభంగా రుణాలు లభించేలా చూడటం, ఇతర దేశాలు అమలు చేసే టారిఫ్‌యేతర చర్యలను ఎదుర్కొనడంలో సహాయాన్ని అందించడం మొదలైన వాటి కోసం ప్రభుత్వం ప్రత్యేక స్కీములను రూపొందిస్తోంది. 2023–24లో 119.71 బిలియన్‌ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యంతో భారత్‌కు అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచిన అమెరికా, మన దేశంపై 26 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. భారత్‌ మొత్తం ఎగుమతుల్లో అమెరికా వాటా 18 శాతంగా ఉంటుంది.

ఎల్రక్టానిక్స్‌ సంస్థల్లో ‘అతి’గా ఆందోళన లేదు..

అమెరికా టారిఫ్‌లపై దేశీయ ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగ తయారీ సంస్థల్లో ప్రస్తుతానికైతే ‘అతి’గా ఆందోళనేమీ లేదని ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి ఎస్‌ కృష్ణన్‌ చెప్పారు. అయితే, మారిపోతున్న పరిస్థితుల మీదే అంతా ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. తయారీ కంపెనీలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని కృష్ణన్‌ వివరించారు. ఎల్రక్టానిక్స్‌ విభాగంలో పోటీదేశాలతో పోలిస్తే తాము కొంత మెరుగైన స్థితిలోనే ఉన్నట్లు దేశీ కంపెనీలు భావిస్తున్నాయి. టారిఫ్‌ల వల్ల అమెరికాకు హార్డ్‌వేర్‌ ఎగుమతులపై ప్రభావం పడినా, ఆసియాలోని మిగతా తయారీ హబ్‌లతో పోలిస్తే సుంకాల భారం తక్కువే ఉండటం మనకు కొంత సానుకూలాంశమని టెలికం పరికరాల తయారీ సంస్థ జీఎక్స్‌ గ్రూప్‌ సీఈవో పరితోష్‌ ప్రజాపతి తెలిపారు.

దిగుమతులపై ఫోకస్‌..

సుంకాల మోతతో ఇతర దేశాల నుంచి భారత్‌లోకి దిగుమతులు వెల్లువెత్తే అవకాశాలను కూడా ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. అమెరికాలో టారిఫ్‌ల కారణంగా అక్కడికి ఎగుమతి చేయాల్సిన ఉత్పత్తులన్నింటినీ చైనా తదితర దేశాలు భారత్‌కు మళ్లించవచ్చని భావిస్తున్నారు. వీటిని సమీక్షించేందుకు ప్రత్యేక మానిటరింగ్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులో వాణిజ్య శాఖ, రెవెన్యూ శాఖ, పారిశ్రామిక ప్రోత్సాహం..అంతర్గత వాణిజ్య విభాగానికి (డీపీఐఐటీ) చెందిన అధికారులు సభ్యులుగా ఉంటారు. జూన్, జులై నుంచి దిగుమతులు ఒక్కసారిగా పెరగవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. 

ఇదీ చదవండి: టాయ్‌ పరిశ్రమకు ‘టారిఫ్‌’ల ప్రయోజనం!

కన్జ్యూమర్‌ గూడ్స్, ఎల్రక్టానిక్స్, రసాయనాలు, ఉక్కు మొదలైనవి వెల్లువెత్తవచ్చని భావిస్తున్నారు. దిగుమతులు పెరుగుదల, దేశీ పరిశ్రమ మీద వాటి ప్రభావాలపై తగు సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆయా శాఖలు, పరిశ్రమ వర్గాలకు ప్రభుత్వం సూచించింది. భారత్‌ నుంచి మొత్తం ఎగుమతుల్లో చైనా వాటా 4 శాతమే అయినప్పటికీ దిగుమతుల్లో మాత్రం 15 శాతంగా ఉంటోంది. 2023–24లో చైనాకు భారత్‌ ఎగుమతులు 16.65 బిలియన్‌ డాలర్లుగా ఉండగా దిగుమతులు 101.73 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. అమెరికాతో మనకు వాణిజ్య మిగులు ఉంటే, చైనాతో మాత్రం ఏకంగా 85 బిలియన్‌ డాలర్ల లోటు ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement