
రూ.1,000 పెరుగుదల
న్యూఢిల్లీ: పసిడి మరోసారి రూ.లక్ష మార్క్పైకి చేరింది. ఇటీవలే మొదటిసారి రూ.లక్ష దాటిన తర్వాత అమ్మకాల ఒత్తిడితో పుత్తడి ఆ స్థాయిని కోల్పోయింది. తాజా పరిణామాల నేపథ్యంలో బంగారానికి మళ్లీ డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా 99.9 శాతం స్వచ్ఛత బంగారం బుధవారం ఢిల్లీ మార్కెట్లో రూ.1,000 పెరిగి రూ.1,00,750 స్థాయిని చేరుకుంది. పాకిస్తాన్–భారత్ మధ్య ఉద్రిక్తతలతో కొనుగోళ్లకు డిమాండ్ ఏర్పడినట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి.
99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం 10 గ్రాములకు రూ.1,050 పెరిగి రూ.1,00,350 స్థాయికి చేరింది. ఏప్రిల్ 22న పసిడి రూ.1,01,600 ఆల్టైమ్ గరిష్ట స్థాయిని నమోదు చేయడం గుర్తుండే ఉంటుంది. మరోవైపు వెండి కిలోకి రూ.440 పెరిగి రూ.98,940 స్థాయిని సమీపించింది. అంతర్జాతీయ మార్కెట్లో భిన్నమైన పరిస్థితి కనిపించింది. బంగారం 25 డాలర్ల నష్టంతో 3,397 డాలర్ల వద్ద ఉంది.
యూస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల నిర్ణయాలకు ముందు అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిని అనుసరించినట్టు తెలుస్తోంది. ‘వాణిజ్య చర్చల్లో పురోగతిపై ఆశలతో మళ్లీ రిస్కీ ఆస్తులవైపు మార్కెట్లు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికీ మధ్య ప్రాచ్యం, రష్యా–ఉక్రెయిన్, భారత్–పాక్ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి అనిశ్చితుల్లో సురక్షిత సాధనంగా బంగారానికి డిమాండ్ కొనసాగుతుంది’ అని అబాన్స్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ సీఈవో చింతన్ మెహతా పేర్కొన్నారు.