అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నేడు భారత స్టాక్ మార్కెట్ను కుదిపేసేలా కనిపిస్తున్నాయి. నేడు (గురువారం) ట్రేడింగ్ ప్రారంభానికి ముందే గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఆసియా స్టాక్ మార్కెట్ సూచీలు భారీ పతనం దిశగా పయనిస్తుండటంతో మన దేశీయ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు నేడు గ్యాప్ డౌన్తో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఆసియా మార్కెట్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. జపాన్ సూచీ నిక్కీ, కోస్పీ-దక్షిణ కొరియా మార్కెట్, గిఫ్ట్ నిఫ్టీ.. వంటి ముందస్తు దిక్సూచిగా భావించే సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇది భారత మార్కెట్లు కనీసం 1.5% నుంచి 2% నష్టంతో ప్రారంభమవుతాయని సూచిస్తోంది.
మార్కెట్ల పతనానికి ప్రధాన కారణాలు
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ కూటమి మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు మార్కెట్లను భయపెడుతున్నాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి గుండా చమురు రవాణా నిలిచిపోవచ్చనే వార్తలు ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తున్నాయి.
యుద్ధ భయాలతో బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా భారీగా పెరిగింది. భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఇది ద్రవ్యోల్బణ ముప్పుగా పరిణమించనుంది.
గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) షేర్ల ర్యాలీకి బ్రేక్ పడింది. టెక్ దిగ్గజాల వాల్యుయేషన్లపై అనుమానాలు మొదలవడంతో అంతర్జాతీయ స్థాయిలో టెక్ షేర్లను ఇన్వెస్టర్లు వదిలించుకుంటున్నారు.
భారత మార్కెట్పై ప్రభావం ఎలా ఉండబోతోంది?
నిపుణుల అంచనా ప్రకారం.. మార్కెట్ అవర్స్లో బ్యాంక్ నిఫ్టీ, ఐటీ రంగాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. ఎఫ్ఐఐలు పెద్ద ఎత్తున నిధులను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. మార్కెట్లు పడిపోతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో నేడు బంగారం పెరిగే అవకాశం ఉంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ మరింత బలహీనపడవచ్చు.
‘ప్రస్తుత అస్థిరత నేపథ్యంలో రిటైల్ ఇన్వెస్టర్లు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మార్కెట్ స్థిరపడే వరకు వేచి చూడటం లేదా నాణ్యమైన షేర్లలో దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం ఈ పతనాన్ని అవకాశంగా మార్చుకోవడం ఉత్తమం’ అని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: చమురు, గ్యాస్.. తర్వాత దీని వంతే!


