క్రూడ్‌ కూల్‌.. బుల్‌ చల్‌! | Markets rebound as Sensex rises 640 pts as oil prices fall | Sakshi
Sakshi News home page

క్రూడ్‌ కూల్‌.. బుల్‌ చల్‌!

Mar 11 2026 1:21 AM | Updated on Mar 11 2026 1:22 AM

Markets rebound as Sensex rises 640 pts as oil prices fall

సెన్సెక్స్‌ 640 పాయింట్లు జూమ్‌ 

234 పాయింట్లు ఎగసిన నిఫ్టీ

24,262 వద్ద ముగింపు

వారం రోజులుగా భగభగలాడి చప్పున చల్లారిన చమురు ధరలతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి. ఆసియా, యూరోపియన్‌ మార్కెట్లు 2 శాతంపైగా బలపడటంతో దేశీయంగానూ ఇండెక్సులు జోరందుకున్నాయి. వెరసి ఒక దశలో సెన్సెక్స్‌ 960 పాయింట్లు జంప్‌చేసింది.

ముంబై: పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధ సంక్షోభం త్వరలోనే ముగియనున్న అంచనాలకుతోడు.. ముడిచమురు ధరలు ఒక్కసారిగా చల్లబడటంతో ప్ర పంచవ్యాప్తంగా సెంటిమెంటు మెరుగుపడింది. దీంతో తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో నేలక్కొట్టిన బంతిలా మార్కెట్లు పైకెగశాయి. సెన్సెక్స్‌ 640 పాయింట్లు జంప్‌చేసి 78,206 వద్ద ముగిసింది. నిఫ్టీ 234 పాయింట్లు జమ చేసుకుని 24,262 వద్ద స్థిరపడింది. ఆసియా, యూరప్‌ మార్కెట్లు 5–2 శాతం మధ్య పుంజుకోవడంతో ఇన్వెస్టర్లకు జోష్‌వచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 960 పాయింట్లు ఎగసి 78,526ను తాకగా.. నిఫ్టీ 24,303వరకూ బలపడింది. 

ఐటీ డీలా 
ఎన్‌ఎస్‌ఈలో ఐటీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌(0.4 శాతం)మినహా మిగిలిన అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా ముందురోజు పతనమైన ఆటో, బ్యాంకింగ్, కన్జూమర్‌ డ్యూరబుల్స్, కెమికల్స్‌ 3–1.6 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో శ్రీరామ్‌ ఫైనాన్స్‌ 8 శాతం దూసుకెళ్లగా.. ఇండిగో, ఎంఅండ్‌ఎం, ఐషర్, టీఎంపీవీ, ఐసీఐసీఐ, మారుతీ, యాక్సిస్, అల్ట్రాటెక్, ఏషియన్‌ పెయింట్స్, బజాజ్‌ ఆటో, ఎస్‌బీఐ లైఫ్, జేఎస్‌డబ్ల్యూ 3.5–2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. బ్లూచిప్స్‌లో ఇన్ఫోసిస్, ఎటర్నల్, రిలయన్స్, ఎయిర్‌టెల్, టీసీఎస్‌ మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 1.4–0.4 శాతం మధ్య నీరసించాయి. 

చల్లారిన చమురు...
ఉదయం సెషన్‌లో లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు పీపా ధర 9 శాతం పతనమై 90 డాలర్లకు చేరగా.. న్యూయార్క్‌లో లైట్‌ స్వీట్‌ చమురు బ్యారల్‌ 87 డాలర్లకు దిగివచ్చింది. ఫలితంగా ఏవియేషన్, ఆటో, బ్యాంకింగ్‌ తదితర రంగాల కౌంటర్లకు డిమాండ్‌ పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. పశి్చమాసియా ఆందోళనలకు త్వరలోనే ముగింపు పలకనున్నట్లు యూఎస్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ప్రకటించడంతో సెంటిమెంటుకు ప్రోత్సా హం లభించినట్లు తెలియజేశారు. దీంతో బీఎస్‌ఈలో మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ మరింత అధికంగా 2 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 3,053 లాభపడితే.. 1,231 మాత్రమే డీలా పడ్డాయి. 

ఎఫ్‌పీఐల వెనకడుగు 
ఇటీవల దేశీ స్టాక్స్‌లో అమ్మకాలకే మొగ్గు చూపుతున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) నగదు విభాగంలో తాజాగా రూ. 4,673 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. దేశీ ఫండ్స్‌ (డీఐఐలు) మాత్రం రూ. 6,333 కోట్లు ఇన్వెస్ట్‌ చేశాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 6346 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 9,014 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ నెల తొలి నాలుగు రోజుల్లో(2–6)నూ ఎఫ్‌పీఐలు రూ. 21,000 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించడం గమనార్హం.

రూపాయి రయ్‌.. 
36 పైసలు అప్‌– 91.85కు 
చమురు ధరలు దిగిరావడంతో దేశీ కరెన్సీకి జోష్‌ వచ్చింది. డాలరుతో మారకంలో 36 పైసలు బలపడింది. వెరసి చరిత్రాత్మక కనిష్టం 92.21 నుంచి కోలుకుని 92 దిగువన 91.85 వద్ద ముగిసింది. రోజంతా 91.71– 92.19 మధ్య ఊగిసలాడింది. సోమవారం 39 పైసలు క్షీణించి 92.21 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ సైతం 0.5 శాతం క్షీణించి 98.65కు చేరింది.

ఎరువుల షేర్లకు బలిమి 
గ్యాస్‌ కేటాయింపులలో ఎల్‌పీజీ, సీఎన్‌జీ, పీఎన్‌జీ తదుపరి ఎరువులకు ద్వితీయ ప్రాధాన్యతనిస్తున్నట్లు కేంద్రం ప్రకటించడంతో ఫెర్టిలైజర్‌ కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్‌ పుట్టింది. దీంతో రాష్ర్టీయ కెమికల్స్‌(ఆర్‌సీఎఫ్‌) 16%, నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌(ఎన్‌ఎఫ్‌ఎల్‌) 13%, దీపక్‌ ఫెర్టిలైజర్స్, పారదీప్‌ ఫాస్ఫేట్స్, చంబల్‌ ఫెర్టిలైజర్స్‌ 5%, కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ 4% చొప్పున దూసుకెళ్లాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement