అమెరికాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ మోటార్ కంపెనీ రూ.2 కోట్లు సంపాదించే ఓ ఉద్యోగిని కేవలం 1.95 డాలర్లు (సుమారు రూ.186) విలువైన కుకీని దొంగిలించాడనే ఆరోపణతో తొలగించడం తీవ్ర చర్చకు దారితీసింది. అయితే అతడు కుకీకి డబ్బులు చెల్లించినట్లు బ్యాంకు రికార్డులు నిరూపించడంతో కంపెనీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన అమెరికాలో కార్యాలయాల్లో అమలవుతున్న జీరో-టాలరెన్స్ విధానాలు, సెల్ఫ్-చెక్అవుట్ వ్యవస్థల విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
కెంటకీ రాష్ట్రంలోని లూయిస్విల్లేలో ఉన్న కెంటకీ ట్రక్ ప్లాంట్లో 11 సంవత్సరాలుగా ఎలక్ట్రిషియన్గా పనిచేసిన 60 ఏళ్ల కర్ట్ క్రోమ్ (Kurt Kromm) ఈ ఘటనకు కేంద్రబిందువయ్యాడు. ఈ ప్లాంట్లో ఫోర్డ్ సూపర్ డ్యూటీ పికప్ ట్రక్కులు, ఎక్స్పెడిషన్ ఎస్యూవీ, లింకన్ నావిగేటర్ వంటి వాహనాలు తయారవుతాయి.
క్రోమ్ చెప్పిన వివరాల ప్రకారం, మే నెలలో రాత్రి షిఫ్ట్లో పనిచేస్తున్న సమయంలో రక్తంలో చక్కెర స్థాయి తగ్గడంతో క్యాంటీన్లోని సెల్ఫ్-సర్వీస్ కియోస్క్ వద్ద గ్రాండ్మాస్ చాక్లెట్ చిప్ కుకీ కొనుగోలు చేశాడు. మొదటి కియోస్క్లో కార్డు స్వైప్ చేసినప్పుడు లావాదేవీ విఫలమైనట్లు సందేశం కనిపించడంతో, పక్కనే ఉన్న మరో కియోస్క్లో మళ్లీ చెల్లించి కుకీ తీసుకున్నానని తెలిపాడు.
వీడియో ఆధారంగా దొంగతనం ఆరోపణ
వారం రోజులకు అతడిని అధికారుల కార్యాలయానికి పిలిచి, సీసీటీవీ వీడియోలో కుకీకి చెల్లించకుండా తీసుకెళ్లినట్లు కనిపిస్తోందని, అందువల్ల ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు తెలియజేశారు. తన వద్ద ఎలాంటి వివరణ తీసుకోకుండా ప్లాంట్ నుంచి బయటకు పంపించారని క్రోమ్ ఆరోపించాడు. యూనియన్ ప్రతినిధులు క్షమాపణ చెప్పాలని సూచించినప్పటికీ, తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పి నిరాకరించాడు. గతేడాది తన సంపాదన 2 లక్షల డాలర్లని (రూ .1.9 కోట్లు), ఆఫీస్ క్యాంటీన్కే సుమారు 1,200 డాలర్లు (రూ .1.14 లక్షలు) ఖర్చు చేశానని, దొంగతనం చేయాల్సిన అవసరం తనకేంటని క్రోమ్ ప్రశ్నించారు.
బ్యాంకు స్టేట్మెంట్తో బయటపడిన నిజం
ఇంటికి వెళ్లిన తర్వాత తన బ్యాంకు ఖాతాను పరిశీలించగా 1.95 డాలర్ల డెబిట్ లావాదేవీ విజయవంతంగా నమోదైనట్లు గుర్తించాడు. ఆ ఆధారాలను ఫోర్డ్ యాజమాన్యానికి, యూనియన్కు పంపించాడు. అనంతరం కియోస్క్ నిర్వహించే అరామార్క్ (Aramark) కూడా చెల్లింపు జరిగినట్లు ధ్రువీకరించింది. దీంతో ఫోర్డ్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని తిరిగి ఉద్యోగంలో చేరాలని ఆహ్వానించింది.
అయితే అప్పటికే క్రోమ్ తన ఇంటికి సమీపంలో మరో ఉద్యోగంలో చేరేందుకు అంగీకరించాడు. గతంలో ఫోర్డ్లో పొందిన గంటకు 48 డాలర్ల వేతనం కంటే ఎక్కువగా కొత్త సంస్థలో 52.51 డాలర్లు, అదనంగా గంటకు 10 డాలర్ల బోనస్ లభించడంతో తిరిగి ఫోర్డ్లో చేరలేదు. ఉద్యోగం కోల్పోయిన ఐదు వారాల కాలానికి ఫోర్డ్ అతనికి బకాయి వేతనాన్ని కూడా చెల్లించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
ఫోర్డ్ స్పందన
వ్యక్తిగత ఉద్యోగుల వ్యవహారాలపై వ్యాఖ్యానించబోమని ఫోర్డ్ పేర్కొన్నప్పటికీ, "కొన్ని సందర్భాల్లో వ్యవహారాన్ని మరింత మెరుగ్గా నిర్వహించాల్సి ఉండేదని తర్వాత తెలుస్తుంది. మా ఉద్యోగులతో న్యాయంగా వ్యవహరించాలనే లక్ష్యమే మా దృష్టి" అని సంస్థ ప్రతినిధి వెల్లడించారు. ఈ ఘటన అనంతరం ఇలాంటి వివాదాలను పరిష్కరించే విధానాలను పునఃసమీక్షిస్తున్నట్లు కూడా సమాచారం.


