
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జోహో కార్పొరేషన్లో భాగమైన ఎంటర్ప్రైజ్ ఐటీ మేనేజ్మెంట్ ఉత్పత్తుల సంస్థ మేనేజ్ఇంజిన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్యకలాపాలను విస్తరించడంపై మరింతగా దృష్టి పెడుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని రేణిగుంటలో, తెలంగాణలోని హైదరాబాద్లో రెండు కార్యాలయాలు ఉన్నట్లు సంస్థ ఏఐ సెక్యూరిటీ హెడ్ సుజాత ఎస్ అయ్యర్ తెలిపారు. రేణిగుంటలో 1,000 మంది పైగా సిబ్బంది ఉన్నట్లు వివరించారు. హైదరాబాద్ డిజిటల్ హబ్గా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రాంతీయంగా సంస్థలకు పటిష్టమైన ఏఐ ఆధారిత ఐటీ, సైబర్సెక్యూరిటీ సొల్యూషన్స్ను అందిస్తున్నట్లు వివరించారు.
వివిధ రంగాల కంపెనీల అవసరాలను బట్టి ఉపయోగపడే లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్ను (ఎల్ఎల్ఎం) రూపొందించడంపై కసరత్తు చేస్తున్నామన్నారు. తమకు ప్రస్తుతం భారత్ మూడో అతి పెద్ద మార్కెట్గా ఉంటోందని, త్వరలో రెండో పెద్ద మార్కెట్ కాబోతోందని సుజాత చెప్పారు. గత ఐదేళ్లుగా మేనేజ్ఇంజిన్ క్లౌడ్ సర్వీసుల విభాగం వార్షికంగా 70 శాతం వృద్ధి చెందుతోందని తెలిపారు. కస్టమర్లపరంగా చూస్తే దేశీ మార్కెట్లో బీఎఫ్ఎస్ఐ, తయారీ, రియల్ ఎస్టేట్ తదితర రంగాలకు చెందిన 7,500 మంది క్లయింట్లు ఉన్నారని సుజాత తెలిపారు.