యూరప్‌ కారు..  తగ్గిన జోరు! | European carmakers Renault, Volkswagen and Skoda struggle to boost sales in India | Sakshi
Sakshi News home page

యూరప్‌ కారు..  తగ్గిన జోరు!

Jun 24 2025 6:25 AM | Updated on Jun 24 2025 9:41 AM

European carmakers Renault, Volkswagen and Skoda struggle to boost sales in India

భారత్‌లో అమ్మకాలు అంతంతే...

జాబితాలో రేనాల్ట్, వీడబ్ల్యూ, స్కోడా

 మూడేళ్లుగా వాహన అమ్మకాల వెనకడుగు

వెంటో, ర్యాపిడ్, స్కాలా సెడాన్లు డీలా 

న్యూఢిల్లీ: ఆటో రంగ యూరోపియన్‌ దిగ్గజాలు భారత్‌లో వాహన అమ్మకాలు పెంచుకోవడంలో సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. గత మూడేళ్ల డేటా పరిశీలిస్తే రెనాల్ట్, ఫోక్స్‌వేగన్, స్కోడా కార్ల అమ్మకాలు క్షీణిస్తూ వస్తున్నాయి. గ్లోబల్‌ ఆటోమోటివ్‌ పరిశ్రమ డేటా, అనలిటిక్స్‌ అందించే జాటో డైనమిక్స్‌ గణాంకాల ప్రకారం రెనాల్ట్‌ అమ్మకాలు అత్యధికంగా నీరసించాయి. 

2022–23లో 78,296 వాహనాలు విక్రయించగా.. 2023–24లో 45,349కు క్షీణించాయి. గతేడాది(2024–25) మరింత తగ్గి 37,900 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఈ బాటలో స్కోడా విక్రయాలు సైతం దేశీయంగా 52,269 యూనిట్ల నుంచి 2023–24కల్లా 44,522 వాహనాలకు వెనకడుగు వేశాయి. వీటితో పోలిస్తే గతేడాది అమ్మకాలు 44,866 యూనిట్లకు స్వల్పంగా పెరిగాయి. అయితే ఫోక్స్‌వేగన్‌ 2022–23లో 41,263 యూనిట్లు విక్రయించగా.. 2023–24కల్లా ఇవి 43,197కు ఎగశాయి. గతేడాది సైతం 42,230 వాహనాలు అమ్ముడయ్యాయి.  

ఎస్‌యూవీలు కీలకం 
గత మూడేళ్లలో యూరోపియన్‌ ఆటో దిగ్గజాలకు భారత మార్కెట్లో పలు సవాళ్లు ఎదురైనట్లు జాటో డైనమిక్స్‌ ఇండియా ప్రెసిడెంట్‌ రవి జి.భాటియా పేర్కొన్నారు. తొలి దశలో వెంటో, ర్యాపిడ్, స్కాలా తదితర సెడాన్‌లపైనే రేనాల్ట్, వీడబ్ల్యూ, స్కోడా అధిక దృష్టిపెట్టడం అమ్మకాల క్షీణతకు కొంత కారణమైనట్లు తెలియజేశారు. భారత్‌లో వేగవంత వృద్ధిలో ఉన్న ఎస్‌యూవీ విభాగంలో పరిమిత మోడళ్లనే ప్రవేశపెట్టడం ప్రతికూల ప్రభావం చూపినట్లు వివరించారు. వీటికితోడు మోడళ్లలో ఆధునిక వేరియంట్లను ప్రవేశపెట్టడంలో ఆలస్యం అమ్మకాల క్షీణతకు కారణమైనట్లు తెలియజేశారు. 

అంతేకాకుండా టైర్‌–2, టైర్‌–3 పట్టణాలలో తగినస్థాయిలో నెట్‌వర్క్‌ విస్తరించకపోవడం వీటికి జత కలసినట్లు ప్రస్తావించారు. మరోవైపు భారతదేశ ప్రత్యేక పన్నుల విధానం కూడా కలసిరాలేదని పేర్కొన్నారు. అంటే సబ్‌4 మీటర్ల వాహనాలు తక్కువ లెవీల కారణంగా లబ్ది పొందినట్లు తెలియజేశారు. వెరసి జపనీస్, కొరియన్‌ కంపెనీలు తక్కువ వ్యయంలో కంపాక్ట్‌ కార్లను విడుదల చేయడం ద్వారా అమ్మకాలు పెంచుకున్నట్లు తెలియజేశారు. అయితే యూరోపియన్‌ దిగ్గజాలు సంప్రదాయ పద్ధతిలో భారీ మోడళ్లను ప్రవేశపెట్టడం ద్వారా అమ్మకాలు పెంచుకోవడంలో సమస్యలు ఎదుర్కొన్నట్లు వివరించారు.  

పన్ను ప్రభావమిలా 
ప్రస్తుత ఆటోమోటివ్‌ పాలసీ ప్రకారం 1200 సీసీ సామర్థ్యంవరకూ 4 మీటర్లలోపుగల ప్యాసింజర్‌ వాహనాల(పెట్రోల్, సీఎన్‌జీ, ఎల్‌పీజీ)పై 28 శాతం వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) విధిస్తారు. 1 శాతం కాంపెన్సేషన్‌ సెస్‌ ఉంటుంది. 4 మీటర్లలోపుగల 1500 సీసీ ప్యాసింజర్‌ వాహనాల(డీజిల్‌)పై 28 శాతం జీఎస్‌టీ, 3 శాతం కాంపెన్సేషన్‌ సస్‌ అమలవుతుంది. 4మీటర్లకుపైన 1500 సీసీ ప్యాసింజర్‌ వాహనాలపై 28 శాతం జీఎస్‌టీ, 17 శాతం సెస్‌ వర్తిస్తుంది. ఇక 1500 సీసీకి మించిన వాహనాలపై 28 శాతం జీఎస్‌టీ, 17 శాతం సెస్‌ అమలవుతుంది. 4 మీటర్లకు, 1500 సీసీకి మించిన (170 ఎంఎంకు మించిన గ్రౌండ్‌ క్లియరెన్స్‌గల) ఎస్‌యూవీలపై 28 శాతం జీఎస్‌టీ, 22 శాతం సెస్‌ను విధిస్తారు.

దేశీ దిగ్గజాల దూకుడు 
దేశీ దిగ్గజాలు టాటా మోటార్స్, మహీంద్రా అండ్‌ మహీంద్రాసహా జపాన్‌ దిగ్గజం మారుతీ సుజుకీ స్థానిక విడిభాగాలకు ప్రాధాన్యత ఇవ్వడం, త్వరత్వరగా వేరియంట్లను విడుదల చేయడం, సీఎన్‌జీ, హైబ్రిడ్స్, బీఈవీ తదితర ప్రత్యామ్నాయ ఇంధన ఇంజిన్ల మోడళ్లను ప్రవేశపెట్టడం వంటి సానుకూలతలతో అమ్మకాలు పెంచుకుంటూ వచి్చనట్లు భాటియా పేర్కొన్నారు. తద్వారా మార్కెట్‌ వాటాను కొల్లగొడుతున్నట్లు తెలియజేశారు. అయితే స్కోడా ఇటీవల భారత్‌ మార్కెట్‌ కోసమే సబ్‌కాంపాక్ట్‌ ఎస్‌యూవీ ‘కైలాక్‌’ను రూపొందించి విడుదల చేసింది. తద్వారా అమ్మకాలు పెంచుకోవడంపై దృష్టి పెట్టినట్లు భాటియా తెలియజేశారు. యూరోపియన్‌ దిగ్గజాలు భవిష్యత్‌లో దేశీ తయారీ మోడళ్లను ఎగుమతులకు వినియోగించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా 4 మీటర్లలోపు వాహనాలు, ఆర్‌అండ్‌డీ, చౌకవ్యయ ప్లాట్‌ఫామ్స్‌పై దృష్టి పెట్టే వీలున్నట్లు వివరించారు. తద్వారా తిరిగి వాహన అమ్మకాల్లో నిలకడైన వృద్ధిని కొనసాగించే వీలున్నట్లు అంచనా వేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement