
ఆన్లైన్ పోర్టల్ సేవలను వినియోగించుకోవాలి
వ్యక్తిగత డేటా గోప్యతను రిస్క్ లో పెట్టుకోవద్దు
సభ్యులకు ఈపీఎఫ్వో సూచన
న్యూఢిల్లీ: పీఎఫ్ క్లెయిమ్లు, ఆన్లైన్ సేవల విషయంలో ఏజెంట్ల సాయం తీసుకోవద్దంటూ ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ తన సభ్యులకు కీలక సూచన చేసింది. తమ భవిష్యనిధికి సంబంధించి సేవల కోసం ఆన్లైన్ పోర్టల్ను వినియోగించుకోవాలని సూచించింది. దీనివల్ల వ్యక్తిగత వివరాలు రిస్క్ లో పడకుండా ఉంటాయని పేర్కొంది. వేగవంతమైన, పారదర్శకమైన సేవలు, వినియోగ అనుకూలమైన ఎన్నో సంస్కరణ చర్యలను ఈపీఎఫ్వో అమలు చేసినట్టు కేంద్ర కారి్మక శాఖ సైతం గుర్తు చేసింది.
ఈపీఎఫ్వో సభ్యులు ఉచితంగా పొందాల్సిన సేవలపై సైబర్ కేఫ్ ఆపరేటర్లు, ఫిన్టెక్ కంపెనీలు పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తుండడం తమ దృష్టికి వచ్చినట్టు తెలిపింది. సభ్యులు నేరుగా ఉచితంగా వినియోగించుకోతగిన ఈపీఎఫ్వో ఆన్లైన్ ఫిర్యాదుల పోర్టల్ను ఈ ఆపరేటర్లు వినియోగిస్తున్నట్టు పేర్కొంది. మూడో పక్ష కంపెనీలు లేదా ఏజెంట్లను ఆశ్రయించడం వల్ల సభ్యుల సున్నితమైన ఆర్థిక డేటా లీకయ్యే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది.
సీపీజీఆర్ఏఎంఎస్ లేదా ఈపీఎఫ్ఐజీఎంఎస్ పోర్టల్స్లో ఫిర్యాదు చేయొచ్చని, సకాలంలో పరిష్కారమయ్యేంత వరకు పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపింది. క్లెయిమ్ దాఖలు, నిధుల బదిలీ, కేవైసీ అప్డేషన్, ఇతర ఏ ఫిర్యాదు అయినా ఉచితమేనని.. వీటి కోసం ఎవరికీ ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఏవైనా సమస్యలు ఉంటే ఈపీఎఫ్వో హెల్ప్ డెస్క్లు లేదా ప్రాంతీయ కార్యాలయాల్లో పీఆర్వోలను సంప్రదించొచ్చని సూచించింది. ఈపీఎఫ్వో పరిధిలో 7 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు.