ప్రైవేటు ఉద్యోగాల్లో ఇప్పుడు లేఆఫ్లు, ఉద్యోగుల తొలగింపులు చర్చనీయాశంగా మారాయి. ఎప్పుడు ఎవరికి ఉద్వాసన వస్తుందో చెప్పలేనట్టుగా పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో హెచ్ఆర్ నుంచి టర్మినేషన్ లెటర్ వస్తే ఏ ఉద్యోగి అయినా హడలిపోతారు. అదే సీఈవోతో సహా సంస్థలోని ఉద్యోగులందరికీ తొలగింపు లెటర్లు వస్తే..
ఈ సంఘటన ఓ కంపెనీలో చోటుచేసుకుంది. అయితే ఇదంతా పొరపాటున జరిగింది. తమ సంస్థలో జరిగిన ఈ ఉదంతం గురించి ప్రొఫెషనల్ నెట్వర్క్ంగ్ ప్లాట్ఫామ్ ‘రెడిట్’లో ఓ యూజర్ పంచుకున్నారు. టెంప్లేట్ చేసిన "టర్మినేషన్" ఈమెయిల్లను పంపే కొత్త ఆఫ్ బోర్డింగ్ ఆటోమేషన్ సాధనాన్ని హెచ్ఆర్ విభాగం పరీక్షిస్తుండగా "టెస్ట్ మోడ్ నుండి లైవ్ మోడ్కు మారడం ఎవరో మర్చిపోయారు" అని యూజర్ పోస్ట్ లో వివరించారు.
పొద్దుపొద్దున్నే కంపెనీ సీఈవోతో సహా మొత్తం 300 మంది ఉద్యోగులకు ఒక ఈమెయిల్ వచ్చింది. 'ఇది మీ చివరి పని దినం తక్షణమే అమలులోకి వస్తుంది' అని అందులో పేర్కొన్నారు. ఇది పొరపాటున వచ్చిందని ఉద్యోగులు ఉద్యోగులు గుర్తించినప్పటికీ ఒక మేనేజర్ అయితే "ఇక నేను సర్దుకోవడం ప్రారంభించాలా?" అంటూ అడిగారని, చివరికి ఐటీ విభాగం రంగంలోకి దిగి "ఎవరినీ తొలగించలేదు.. దయచేసి మీ బ్యాడ్జీలను తీసేయొద్దు " అని పెద్ద అక్షరాలతో సందేశాన్ని పోస్ట్ చేయవలసి వచ్చిందని రెడిటర్ పేర్కొన్నారు.
ఈ విచిత్ర సంఘటన గురించిన పోస్ట్ వెంటనే వైరల్గా మారిపోయింది. వేలాదిగా అప్ ఓట్లు, కామెంట్లు వెల్లువెత్తాయి. ఘటనపై యూజర్లు తమకు తోచిన విధంగా వ్యాఖ్యానిస్తూ తమ యాజమాన్యాలతో ఎదురైన సొంత అనుభవాలను కామెంట్ చేశారు. ఇలాంటి సాధనం కావాలని భావించే ఏ సంస్థ అయినా విఫలం అవుతుందంటూ ఒక యూజర్ వ్యాఖ్యానించారు.


