ఎకా మొబిలిటీ రూ.850 కోట్ల పెట్టుబడి! | EKA Mobility to partner with Mitsui VDL plans joint investment Rs 850 crore | Sakshi
Sakshi News home page

ఎకా మొబిలిటీ రూ.850 కోట్ల పెట్టుబడి!

Dec 28 2023 8:06 AM | Updated on Dec 28 2023 8:07 AM

EKA Mobility to partner with Mitsui VDL plans joint investment Rs 850 crore - Sakshi

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలో ఉన్న ఎకా మొబిలిటీ తాజాగా జపాన్‌కు చెందిన మిత్సుయి అండ్‌ కో, నెదర్లాండ్స్‌ కంపెనీ వీడీఎల్‌ గ్రూప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దశలవారీగా ఈ విదేశీ సంస్థలు భారత్‌లో సుమారు రూ.850 కోట్లు పెట్టుబడి చేసే అవకాశం ఉంది. మిత్సుయి నుంచి పెద్ద మొత్తంలో వ్యూహాత్మక పెట్టుబడులు, వీడీఎల్‌ నుంచి సాంకేతిక మద్దతు, ఈక్విటీ భాగస్వామ్యం ఎకా మొబిలిటీకి దక్కుతుంది.

ఉమ్మడి పెట్టుబడి, సహకారం కారణంగా ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం ప్రపంచ తయారీ, సరఫరా కేంద్రంగా భారత్‌ను నిలుపుతుందని కంపెనీ బుధవారం ప్రకటించింది. ఎకా కేంద్రంలో తయారయ్యే ఉత్పత్తులను అంతర్జాతీయంగా వివిధ మార్కెట్లకు సరఫరా చేయనున్నట్టు మిత్సుయి వెల్లడించింది. భారత్‌లో అపార అవకాశాలను చూస్తున్నామని, స్పష్టంగా ఇది ఆశాజనక వృద్ధి మార్కెట్‌ అని వీడీఎల్‌ తెలిపింది.

కాగా, ఎకా మొబిలిటీ ప్రస్తుతం 500లకుపైగా ఎలక్ట్రిక్‌ బస్‌లు, 5,000 పైచిలుకు తేలికపాటి ఎలక్ట్రిక్‌ వాణిజ్య వాహనాల సరఫరాకై ఆర్డర్లను కలిగి ఉంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఏర్పాటు చేయనున్న ప్లాంట్లలో ఈ ఈవీలు తయారవుతాయని కంపెనీ తెలిపింది. ఆటో పీఎల్‌ఐ స్కీమ్‌ కింద ఆమోదం పొందిన వాణిజ్య వాహన తయారీ సంస్థల్లో ఎకా మొబిలిటీ ఒకటి.

Advertisement
 
Advertisement
Advertisement