
అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ త్వరలో ముందడుగు
జపాన్ను వెనక్కి నెట్టి నాలుగో స్థానానికి చేరే అవకాశం
ప్రపంచంలోనే యూఎస్, చైనా, జర్మనీ, జపాన్ తర్వాత ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ దూసుకుపోతోంది. త్వరలో జపాన్ను సైతం వెనక్కి నెట్టి నాలుగో స్థానానికి చేరుకుంటోందనే అంచనాలు వెలువడుతున్నాయి. కానీ ప్రజల ఆదాయాలు, వారి సంపద మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. గతంలో ఇటీవల హురున్ ఇండియా దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాను విడుదల చేసింది. రూ.1,000 కోట్ల సంపద కలిగిన వారిని పరిగణనలోకి తీసుకుని దీన్ని రూపొందించారు. దాని ప్రకారం దేశంలోని కుబేరుల సంఖ్య ఏడికేడు పెరుగుతోంది. మొత్తం దేశంలో అత్యధిక సంపన్నుల సంఖ్య 1,539కు పైగానే ఉంది. వీరి వద్ద రూ.159 లక్షల కోట్ల కంటే ఎక్కువే సంపద మూలుగుతుంది. ఏడాది ప్రాతిపదికన వీరి ఆస్తులు 46 శాతం వృద్ధి చెందుతున్నాయి. ఇలా కొద్ది మంది వద్దే రూ.లక్షల కోట్లు పొగవ్వడం సామాజిక అంశాతికి దారితీస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పెరుగుతున్న ఆర్థిక అసమానతలు
చాలా మంది ఇంటిముందు మురికికాలువ పారుతుంటే టెక్నికల్గా ప్రపంచంలోనే టాప్ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ దూసుకుపోతుందని చంకలు చరుచుకోవడం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. పెరుగుతున్న ఆర్థిక అసమానతలు బ్రిటిష్ కాలంలో కంటే ఇప్పుడు ఎక్కువయ్యాయి. కొన్ని నివేదికల ప్రకారం దేశంలోని ఒక శాతం జనాభా చేతుల్లోకి 40.1 శాతం సంపద మూలుగుతోంది. వివిధ వర్గాల ఆదాయ సంపదల్లో అసమానతలు ఉన్నప్పటికీ, అందరి వాస్తవ ఆదాయాలు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే ప్రజల ఆదాయాలతో పాటే వాటి మధ్య అంతరాలు అధికమవుతున్నాయి. అందుకు 1991లో చేపట్టిన ఆర్థిక సంస్కరణలే కారణమని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీటిని అమలు చేయకముందు వరకు దేశ జీడీపీ మూడు శాతం వద్దే ఆగిపోయింది. ఈ సంస్కరణల తర్వాత జీడీపీ 6-8 శాతం పెరిగింది. అయినా గరిష్ఠ సంపద తక్కువ మంది చేతుల్లోకే వెళుతుంది.
సామాజిక అశాంతి నెలకొనే ప్రమాదం
భారత్తోపాటు అనేక దేశాల్లో ఈ ఆర్థిక అసమానతలకు సంబంధించిన సమస్యలు ఎక్కవవుతున్నాయి. ఇవి మరింత పెరిగితే సామాజిక అశాంతి నెలకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ అంతరాలు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అత్యంత ధనవంతులపై విధించే పన్నులు పెంచాలని చెబుతున్నారు. కుబేరులకు వారసత్వంగా వచ్చే సంపదపై పన్ను విధించాలంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు.. ఇందుకు సహకరించాలని కోరుతున్నారు.
దురదృష్టవశాత్తు పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలను పరోక్షంగా నడిపించేది ధనవంతులే. దాంతో చట్ట సభల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ధైర్యం చేయడానికి ప్రజా ప్రతినిధులు సహకరించడం లేదు. కానీ ఆర్థిక అసమానతల వల్ల భవిష్యత్తులో రాబోయే సామాజిక అశాంతిని దృష్టిలో ఉంచుకుని ఈమేరకు పటిష్ట చర్యలు తీసుకోవాల్సి ఉంది.
ఇదీ చదవండి: పసిడి ప్రియులకు ఊరట! తులం ఎంతంటే..
ఏం చేయాలంటే..
భారతదేశం 2027 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ఆకాంక్షిస్తుంది. అయితే ఇలా కుబేరుల సంఖ్య పెంచుకుంటూ, వారి సంపదను లెక్కల్లో చూపుతూ ఈ ఘనత సాధించడంలో అర్థం లేదు. సామాజిక శైలి, సమగ్ర జీవన ప్రమాణాల్లో మార్పు వస్తూ సంపద సృష్టించగలితేనే మేలు జరుగుతుంది. ఈమేరకు విధానాలను పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది. అటువంటి ప్రయత్నాలు చేయకపోతే కొందరి చేతిల్లోనే సంపద చేరి దేశంలో సామాజిక అశాంతి పెరిగే ప్రమాదం ఉంది.