ఈ హైదరాబాద్‌ ఐటీ దంపతుల సంపాదన పెరిగిందిలా.. | Hyderabad IT Couple Reveals How They Grew Salary to Massive Income in Just 8 Years | Sakshi
Sakshi News home page

ఈ హైదరాబాద్‌ ఐటీ దంపతుల సంపాదన పెరిగిందిలా..

Jul 5 2026 1:00 PM | Updated on Jul 5 2026 1:19 PM

Hyderabad IT Couple Reveals How They Grew Salary to Massive Income in Just 8 Years

మెట్రో నగరాల్లో నామ మాత్రపు సంపాదనతో నెట్టుకురావడం కష్టం. దంపతులిద్దరి సంపాదన తోడైతేనే సిటీ జీవనం సాఫీగా సాగుతుంది. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అభిషేక్‌ సింగ్‌ సోషల్‌ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో పంచుకున్న కెరీర్‌ అనుభవం ప్రస్తుతం ఐటీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాను, తన భార్య కలిసి గత ఎనిమిదేళ్లలో ఆదాయాన్ని గణనీయంగా పెంచుకున్న విధానాన్ని వివరిస్తూ చేసిన పోస్టు వేలాది మంది దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ సలహాలపై నిపుణుల అభిప్రాయాలు భిన్నంగా వ్యక్తమవుతున్నాయి.

అభిషేక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరూ ఐటీ రంగంలో కెరీర్‌ను ప్రారంభించిన సమయంలో వారి ఉమ్మడి నెలవారీ టేక్‌హోమ్‌ జీతం సుమారు రూ.66 వేలు మాత్రమే. ప్రస్తుతం ఎనిమిదేళ్ల తర్వాత అప్పటి కంటే ఊహించని స్థాయిలో ఆదాయం పొందుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో రెండు కీలక నిర్ణయాలు తమ ఆర్థిక పురోగతికి ప్రధాన కారణమయ్యాయని చెప్పారు.

ఉద్యోగ మార్పులే కీలకం

కెరీర్‌ ప్రారంభ దశలో ఉద్యోగ మార్పులను తప్పనిసరిగా పరిగణించామని అభిషేక్‌ వెల్లడించారు. తక్కువ జీతంతో సంపద సృష్టించడం కష్టమని, మెరుగైన వేతనం కోసం సంస్థలను మార్చడం వేగవంతమైన మార్గంగా భావించామని వివరించారు. అలాగే, తమలో ఒకరు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే, మరొకరు కూడా అదే సమయంలో అవకాశాలు వెతకడం ఒక అలవాటుగా మార్చుకున్నామని చెప్పారు. దీంతో ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఏర్పడటమే కాకుండా, వేతన చర్చల్లో కూడా పరస్పర అనుభవం ఉపయోగపడిందని ఆయన పేర్కొన్నారు. వేర్వేరు టెక్నాలజీ విభాగాల్లో పనిచేసినా, మార్కెట్‌లో ఉన్న వేతన ధోరణులపై స్పష్టమైన అవగాహన ఏర్పడేదని వివరించారు.

తొలి పదేళ్లు నేర్చుకోవడానికే..

యువ ఐటీ ఉద్యోగులు కెరీర్‌ ప్రారంభ దశలో ప్రతి రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒకసారి కొత్త అవకాశాలను పరిశీలించాలని అభిషేక్‌ సూచించారు. ఇలా చేయడం ద్వారా కొత్త టెక్నాలజీలు, విభిన్న సంస్థల పని విధానం, నాయకత్వ శైలులు తెలుసుకునే అవకాశం లభిస్తుందని అన్నారు. అయితే 30 ఏళ్ల తర్వాత కుటుంబ బాధ్యతలు, పిల్లల చదువు, గృహ రుణాలు వంటి అంశాల కారణంగా ఉద్యోగ భద్రత, స్థిరత్వానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. "మొదటి పదేళ్లు ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత మంచిది. అదే సమయంలో సాధ్యమైనంత ఎక్కువ ఆదాయం సంపాదించాలి. తర్వాత దశలో సంపాదించిన ఆర్థిక భద్రతను కాపాడుకోవడంపైనే దృష్టి పెట్టాలి" అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇది చదివారా? బెంగళూరులో 130 ఏళ్ల ఇల్లు.. భలే మార్చిన ఐటీ దంపతులు

సోషల్‌ మీడియాలో భిన్నాభిప్రాయాలు

అభిషేక్‌ పోస్టుకు స్పందించిన పలువురు ఐటీ నిపుణులు ఆయన సూచనలకు మద్దతు పలికారు. కెరీర్‌ ప్రారంభ దశలో ఉద్యోగ మార్పులు వేతన పెరుగుదలకు దోహదపడతాయని కొందరు పేర్కొన్నారు. అయితే మరికొందరు దీనిపై విభేదించారు. తరచూ ఉద్యోగాలు మారితే దీర్ఘకాలిక నిబద్ధతపై సంస్థలకు సందేహాలు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ప్రస్తుత మార్కెట్‌లో అనేక కంపెనీలు తరచూ ఉద్యోగాలు మారిన అభ్యర్థుల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయని వ్యాఖ్యానించారు. కుటుంబ బాధ్యతలు, రుణాలు, వ్యక్తిగత పరిస్థితులు కూడా ప్రతి ఒక్కరిలో భిన్నంగా ఉంటాయని గుర్తుచేశారు.

మార్కెట్‌ ధోరణి ఏమంటోంది?

ఇటీవలి కాలంలో భారత ఐటీ రంగంలో భారీ నియామకాల వేగం కొంత మందగించినప్పటికీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI), క్లౌడ్‌ కంప్యూటింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ, డేటా ఇంజినీరింగ్‌ వంటి ప్రత్యేక నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులకు ఇప్పటికీ మంచి డిమాండ్‌ కొనసాగుతోంది. హెచ్‌ఆర్‌ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఉద్యోగ మార్పు ఒక్కటే అధిక వేతనానికి మార్గం కాదు. నైపుణ్యాల పెంపు, పనితీరు, నాయకత్వ సామర్థ్యం, వ్యాపార అవగాహన వంటి అంశాలు కూడా దీర్ఘకాలిక కెరీర్‌ విజయాన్ని నిర్ణయించే కీలక అంశాలుగా మారుతున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement