న్యూయార్క్: అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన సంపదను విపరీతంగా పెంచుకున్నారు. గత ఏడాది క్రిప్టో వ్యాపారాల ద్వారా ఏకంగా 1.2 బిలియన్ డాలర్లు (రూ.11,413 కోట్లు) సంపాదించారు. ఈ విషయాన్ని మంగళవారం విడుదలైన ఒక ఫెడరల్ నివేదిక వెల్లడించింది. ట్రంప్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినవారు నష్టపోయారని, ఆయన మాత్రం లాభపడ్డారని పేర్కొంది. ట్రంప్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కేవలం స్టార్టప్లుగా ఉన్న ఈ కొత్త వ్యాపారాలు భారీగా ఆదాయం గడించాయి.
ట్రంప్ తన వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ వ్యాపారం ద్వారా గవర్నెన్స్ టోకెన్లు సహా కొత్త క్రిప్టో ఉత్పత్తులను విక్రయించి 500 మిలియన్ డాలర్లకు పైగా పొందారు. ట్రంప్ ముఖాన్ని ముద్రించిన స్మారక మీమ్ నాణేల అమ్మకాల ద్వారా మరో క్రిప్టో వ్యాపార సంస్థ అయిన సీఐసీ డిజిటల్ ఎల్ఎల్సీ 600 మిలియన్ డాలర్లకు పైగా ఆర్జించింది.
అయితే, అమ్మకాల తర్వాత టోకెన్లు నాణేల విలువ భారీగా పడిపోయింది. ట్రంప్ గత సంవత్సరం తన బ్రాండెడ్ బైబిళ్లు, స్నీకర్లు, ఇతర చిన్న వస్తువులను అమ్మడం ద్వారా మిలియన్ల డాలర్లు ఆర్జించారు. కేవలం బ్రాండెడ్ వాచీల అమ్మకం ద్వారానే ఆయనకు 4.7 మిలియన్ డాలర్లు సమకూరాయి. ట్రంప్ నికర ఆస్తి విలువ 2024లో 2.3 బిలియన్ డాలర్లు ఉండగా, నేడు 6 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఫోర్బ్స్ అంచనా వేసింది.


