పాల ప్యాకెట్లు అమ్ముకునే స్థాయి నుంచి వేలకోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా.. | Danube Group Founder Rizwan Sajan Success Story And His Net Worth | Sakshi
Sakshi News home page

పాల ప్యాకెట్లు అమ్ముకునే స్థాయి నుంచి వేలకోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా..

Sep 23 2024 6:04 PM | Updated on Sep 23 2024 8:02 PM

Danube Group Founder Rizwan Sajan Success Story And His Net Worth

ఒక మనిషి ఎదగాలంటే.. కృషి, పట్టుదల అవసరం. పేదరికం నుంచి వేలకోట్ల సామ్రాజ్యం స్థాపించాలంటే.. ఒక్కరోజులో జరిగే పనికాదు. కానీ శ్రమిస్తే.. ఇది తప్పకుండా సాధ్యమవుతుందనేది మాత్రం అక్షర సత్యం. దీనికి నిలువెత్తు నిదర్శనమే.. 'రిజ్వాన్ సజన్' (Rizwan Sajan). ఇంతకీ ఈయనెవరు? ఈయన ఎలా కోటీశ్వరుడయ్యాడు? లాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ చూసేద్దాం..

డానుబే సంస్థ వ్యవస్థాపకుడు, చైర్మన్ 'రిజ్వాన్ సజన్' ముంబైలోని ఒక మురికివాడలో పుట్టాడు. చిన్నప్పటి నుంచే ఎన్నో కష్టాలను అనుభవించిన రిజ్వాన్.. ఆఖరికి స్కూల్ ఫీజులు కూడా కట్ట లేకపోయాడు. తండ్రి సంపాదనతో ఇల్లు గడవడమే కష్టంగా ఉన్న రోజుల్లో పుస్తకాలను కొని వీధుల్లో తిరిగి అమ్మేవాడు, ఇంటింటికీ పాల ప్యాకెట్లను వేసేవాడు.. రాఖీలు కొనుగోలు చేసి అమ్మడం వంటివి చేసాడు.

చిన్నతనం నుంచే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న రిజ్వాన్ 16వ ఏట తన తండ్రి మరణించారు. ఆ తరువాత కుటుంబ బాధ్యత భుజాలపై పడింది. చదువు మానేసి కువైట్‌కు వెళ్లి తన మామ బిల్డింగ్ మెటీరియల్స్ షాపులో ట్రైనీ సేల్స్‌మెన్‌గా పని చేయడం ప్రారంభించాడు. మెల్ల మెల్లగా ఎదుగుతున్నాడు అనుకునేలోపల గల్ఫ్ యుద్ధం మరోసారి తన జీవితాన్ని మార్చేసింది. మళ్ళీ ముంబైకి వచ్చేశాడు. జీవితం మళ్ళీ జీరో దగ్గరకు వచ్చేసింది.

జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలనే ఆశతో మళ్ళీ సొంతంగా బిజినెస్ చేయడం ప్రారంభించారు. ఇందులో భాగంగానే 1993లో డానుబే గ్రూప్ స్థాపించారు. ఇదే ఆ తరువాత అతిపెద్ద నిర్మాణ సామగ్రి కంపెనీలలో ఒకటిగా విస్తరించింది. 2019నాటికి ఈ డానుబే గ్రూప్ టర్నోవర్ 1.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

ఇదీ చదవండి: వైకల్యాన్ని జయించి.. బిలియనీర్‌గా నిలిచి: జీవితాన్ని మార్చే స్టోరీ

ఓ చిన్న సంస్థగా ప్రారంభమైన డానుబే గ్రూప్ తన కార్యకలాపాలను ఒమన్, బహ్రెయిన్, సౌదీ అరేబియా వంటి దేశాలకు విస్తరించింది. డానుబే గ్రూప్ బిల్డింగ్ మెటీరియల్స్, రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా అనేక వ్యాపారాలను నిర్వహిస్తోంది. యూఏఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం రిజ్వాన్ నికర విలువ రూ. 20,830 కోట్లు అని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం దుబాయ్‌లోని అత్యంత ధనవతులైన భారతీయులలో ఈయన ఒకరుగా నిలిచారు.

Advertisement
 
Advertisement
Advertisement