రోడ్లపై కార్లను నడిపే సమయంలో బాధ్యతగా వ్యవహరించాలని దమన్ కలెక్టర్ సౌరభ్ మిశ్రా, వాహన యజమానులకు సూచించారు. ముఖ్యంగా థార్, ఫార్చ్యూనర్ వాహనాల యజమానులు రోడ్లపై భాయ్గిరి, దాదాగిరి చూపించకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని హెచ్చరించారు. ఇందుకోసం ట్రాన్స్పోర్ట్ నగర్లో 'థార్/ఫార్చ్యూనర్ సంకల్ప్ యాత్ర' పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి దమన్లో రిజిస్టర్ అయిన థార్, ఫార్చ్యూనర్ వాహనాల యజమానులను వారి వాహనాలతో సహా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వందలాది మంది యజమానులు ఒకచోట చేరారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియోలో వరుసగా నిలిపిన థార్, ఫార్చ్యూనర్ వాహనాలను చూడవచ్చు. వాటి ఓనర్స్ వాహనాల ముందు నిలబడి ఉన్నారు. దమన్ కలెక్టర్ సౌరభ్ మిశ్రా వాహన యజమానులతో మాట్లాడి, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బాధ్యతగా వాహనాలు నడుపుతామని వారితో ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమంలో వాహనాలకు చేస్తున్న కొన్ని అనధికార మార్పులపై కూడా అధికారులు దృష్టి పెట్టారు. ముఖ్యంగా వాహనాల అద్దాలకు నిబంధనలకు విరుద్ధంగా టింటెడ్ గ్లాస్ వేయడం, టైర్లలో అక్రమ మార్పులు చేయడం, డీజేలు, సౌండ్ సిస్టమ్స్లో నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేయడంపై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి మార్పులను వెంటనే తొలగించి, వాహనాలను ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా నడపాలని యజమానులకు సూచించారు.
రోడ్డుపై తమ కారు వెళ్లే సమయంలో ఇతర వాహనదారులు, పాదచారులు భయపడే పరిస్థితి ఉండకూడదని దమన్ కలెక్టర్ స్పష్టం చేశారు. థార్ వంటి వాహనాలపై కొంతమందిలో ఉన్న భాయ్గిరి లేదా బెదిరించే ఇమేజ్ను మార్చి, వాటిని బాధ్యతకు చిహ్నంగా మార్చడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు.
ఇదే అంశంపై సోషల్ మీడియా ప్రచారాన్ని కూడా నిర్వహించనున్నట్లు దమన్ జిల్లా యంత్రాంగం ప్రకటించింది. #TharKaMatlabZimmedari అనే హ్యాష్ట్యాగ్తో ప్రచారం చేయాలని యజమానులను కోరింది. ఈ ప్రచారాన్ని మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాను ట్యాగ్ చేయాలని కూడా అధికారులు సూచించారు.
Daman Collector made Thar and Fortuner owners take an oath to drive safely on the roads. pic.twitter.com/zCpJy9BqOr
— DesiEsco🇮🇳 (@DesiEsco7) September 10, 2026


