
ఎనిమిది కీలక రంగాల్లో వృద్ధి 2.9 శాతం
ఇది ఐదు నెలల కనిష్ట స్థాయి
న్యూఢిల్లీ: ఫిబ్రవరిలో మౌలిక రంగం నిదానించింది. ఎనిమిది మౌలిక రంగాల్లో ఉత్పత్తి 2.9 శాతం మేర పెరిగింది. క్రితం ఏడాది ఇదే నెలలో వృద్ధి 7.1 శాతంతో పోల్చి చూస్తే గణనీయంగా తగ్గింది. అంతే కాదు ఇది ఐదు నెలల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. ఈ ఏడాది జనవరిలోనూ కీలక మౌలిక రంగాల్లో 5.1 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది సెపె్టంబర్లో వచ్చిన 2.4 శాతం వృద్ధి చివరి కనిష్ట స్థాయిగా ఉంది.
ముఖ్యంగా ఫిబ్రవరిలో ముడి చమురు, సహజ వాయువు రంగాల్లో ప్రతికూల వృద్ధి (క్షీణత) కనిపించింది. బొగ్గు ఉత్పత్తి 1.7 శాతం వృద్ధి చెందింది. గతేడాది ఫిబ్రవరిలో ఈ రంగంలో 11.6 శాతం వృద్ధి నమోదు కావడం గమనించొచ్చు. రిఫైనరీ ఉత్పత్తుల్లో వృద్ధి క్రితం ఏడాది ఇదే నెలలో ఉన్న 2.6 శాతం నుంచి 0.8 శాతానికి తగ్గిపోయింది.
స్టీల్ ఉత్పత్తి 9.4 శాతం నుంచి 5.6 శాతానికి.. విద్యుదుత్పత్తి 7.6 శాతం నుంచి 2.8 శాతానికి తగ్గిపోవడం గమనార్హం. ఎరువుల ఉత్పత్తి 10.2 శాతం, సిమెంట్ ఉత్పత్తి 10.5 శాతం చొప్పున వృద్ధి చెందడం కొంత కలిసొచ్చింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు మొత్తం 11 నెలల్లో ఈ ఎనిమిది మౌలిక రంగాల్లో వృద్ది 4.4 శాతంగా ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వృద్ధి 7.8 శాతంగా ఉంది. పారిశ్రామికోత్పత్తి సూచీలో (ఐఐపీ) ఈ ఎనిమిది మౌలిక రంగాల వాటా 40.27 శాతంగా ఉంది.