భారీగా పెరిగిన ఇళ్ల ధరలు.. కారణాలు ఇవే! | Construction Costs Increase in Top Indian Cities Know The Details | Sakshi
Sakshi News home page

భారీగా పెరిగిన ఇళ్ల ధరలు.. కారణాలు ఇవే!

Sep 6 2026 9:29 AM | Updated on Sep 6 2026 10:45 AM

Construction Costs Increase in Top Indian Cities Know The Details

భారత్‌లో ఇళ్ల ధరలు గత ఐదేళ్లలో నిర్మాణ ఖర్చుల కంటే చాలా వేగంగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో 2021 నుంచి 2025 మధ్య కాలంలో ఇళ్ల నిర్మాణ ఖర్చు 34 శాతం పెరిగితే.. ఇళ్ల ధరలు ఏకంగా 59 శాతం పెరిగాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది.

నిర్మాణ ఖర్చు
అనరాక్ నివేదిక ప్రకారం.. 2021లో ఒక సాధారణ ప్లస్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ను నిర్మించడానికి చదరపు అడుగుకు సగటున రూ.2,681 ఖర్చయ్యేది. 2025 నాటికి అది రూ.3,604కు చేరింది. అంటే ఐదేళ్లలో నిర్మాణ ఖర్చు సుమారు 34 శాతం పెరిగింది. ఏడాదికి 6.9 శాతం పెరుగుదల అన్నమాట.

ఇళ్ల ధరలు
ఇదే సమయంలో ఇళ్ల సగటు ధరలు కూడా చాలా వేగంగా పెరిగాయి. 2021లో ప్రధాన నగరాల్లో చదరపు అడుగు సగటు రెసిడెన్షియల్ క్యాపిటల్ విలువ రూ.5,826గా ఉండగా, 2025 నాటికి అది రూ.9,260కు చేరింది. అంటే ఐదేళ్లలో ఇళ్ల ధరలు ఏకంగా 59 శాతం పెరిగాయి. వార్షిక వృద్ధి రేటు దాదాపు 12 శాతంగా ఉంది.

మొత్తం మీద నిర్మాణ ఖర్చు 34 శాతం పెరిగితే.. ఇళ్ల ధర మాత్రం 59 శాతం పెరిగిందని నివేదిక చెబుతోంది. ఈ రెండింటి మధ్య దాదాపు 25 శాతం వ్యత్యాసం ఉంది.

ఇళ్ల ధరలు పెరగడానికి కారణం
ఇళ్ల ధరలు కేవలం సిమెంట్, స్టీల్, కార్మిక ఖర్చుల వల్ల మాత్రమే పెరగడం లేదు. ఇందులో భూమి ధరలు, డెవలపర్ల మార్జిన్లు, డిమాండ్ అండ్ సప్లై పరిస్థితులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా.. పెద్ద నగరాల్లో భూమి ధరలు భారీగా పెరిగాయి. కొత్త రోడ్లు, మెట్రో, ఇతర మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో భూమి విలువలు మరింత వేగంగా పెరుగుతున్నాయి.

నిర్మాణ ఖర్చులు కూడా గణనీయంగా పెరిగాయి. స్టీల్, ఇంధనం, రవాణా, ఫినిషింగ్ మెటీరియల్స్ వంటి ఖర్చులు కూడా కారణమయ్యాయి. టైల్స్, గ్లాస్, హార్డ్‌వేర్ వంటి ఫినిషింగ్ మెటీరియల్స్ ధరలు సుమారు 8-12 శాతం పెరిగాయి. మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్‌కు సంబంధించిన ఖర్చులు కూడా 9-13 శాతం పెరిగాయి. కార్మిక వ్యయం పెరగడం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతోంది.

అనరాక్ ప్రకారం.. 2021 నుంచి 2026 మొదటి అర్ధభాగం వరకు ప్రధాన నగరాల్లోని చాలా ప్రాంతాల్లో భూమి ధరలు 50 నుంచి 120 శాతం వరకు పెరిగాయి. ఢిల్లీ ఎన్‌సీఆర్‌, బెంగళూరు ప్రాంతాల్లో ఈ పెరుగుదల మరింత ఎక్కువగా ఉంది.

ఇల్లు కొనేవారికి కష్టమేనా?
ఇళ్ల ధరలు నిర్మాణ ఖర్చుల కంటే వేగంగా పెరగడం వల్ల ప్రధానంగా హోమ్‌బయ్యర్లపై భారం పెరుగుతుంది. ముఖ్యంగా మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాలకు చెందినవారు ఇప్పటికే ఈఎంఐలు, డౌన్ పేమెంట్, ఇతర ఖర్చులను భరించాల్సి ఉంటుంది. ఇళ్ల ధరలు మరింత పెరిగితే వారికి అందుబాటులో ఉన్న ఇళ్ల ఎంపికలు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే.. ప్రీమియం, లగ్జరీ ఇళ్ల విషయంలో పరిస్థితి కొంత భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే.. అధిక ఆదాయం ఉన్న కొనుగోలుదారులు ధరల పెరుగుదలను కొంతవరకు భరించగలరు.

ఇదీ చదవండి: SBI స్కీమ్.. డబ్బు దాచుకోవడానికి మంచి మార్గం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement