జీతం పెంచలేదని ఉద్యోగం మానేసిన మహిళ.. తర్వాత.. | company refused to give salary hike you know what happen next | Sakshi
Sakshi News home page

జీతం పెంచలేదని ఉద్యోగం మానేసిన మహిళ.. తర్వాత..

May 22 2025 1:51 PM | Updated on May 22 2025 2:25 PM

company refused to give salary hike you know what happen next

కంపెనీలో జీతం పెంచనందుకు ఉద్యోగం మానేసిన ఓ మహిళకు తిరిగి ఆ సంస్థ యాజమాన్యం పిలుపు అందించింది. గతంలో తాను డిమాండ్‌ చేసిన దానికంటే అధికంగా వేతనం చెల్లిస్తామని చెప్పింది. దాంతోపాటు పదోన్నతి ఇస్తామని పేర్కొంది. దీనికి సంబంధించిన ఓ పోస్ట్‌ రెడ్డిట్‌లో అప్‌లోడ్‌ చేయడంతో వైరల్‌గా మారింది.

రెడ్డిట్‌ పోస్ట్‌లోని వివరాల ప్రకారం.. యూఎస్‌లోని ఓ కంపెనీలో పని చేస్తున్న మహిళ తన జీతం పెంచాలని మేనేజ్‌మెంట్‌కు వేడుకుంది. వేతన పెంపునకు చాలా కాలంగా వేచి చూశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. జీతం కోసం అడిగిన ప్రతిసారి ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేయడం లేదని, తగినంత అనుభవం లేదని, ఎదగడానికి ఇంకా సమయం పడుతుందని, ప్రస్తుతం తమకు బడ్జెట్ లేదని.. యాజమాన్యం చెబుతూ వచ్చింది. ఈ కారణాలతోనే నెలలు సాగదీశారు. దీన్ని తట్టుకోలేక ఆమె ఉద్యోగాన్ని వదిలేసింది.

ఆరు నెలల తర్వాత, తాను వెళ్లిపోయినప్పటి నుంచి కంపెనీ పరిస్థితులు దిగజారాయి. దాంతో తనను తిరిగి కంపెనీలోకి రావాలని యాజమాన్యం వేడుకుంది. తాను ముందుగా డిమాండ్‌ చేసిన 15 శాతం కంటే అధికంగా 40 శాతం వేతనంలో పెంపు ఇస్తామని కంపెనీ పేర్కొంది. కానీ దానికి ఆమె విముఖత చూపడంతో 55 శాతం వేతన పెంపుతోపాటు పదోన్నతి ఇస్తామని తెలిపింది. ఈ వ్యవహారంపై మహిళ స్పందిస్తూ.. తాను కంపెనీలో ఎంతో కమిట్‌మెంట్‌తో పని చేశానని చెప్పారు. పనిలో మెరుగైన ఉద్యోగుల సామర్థ్యాలను సంస్థలు తక్కువ అంచనా వేయకూడదని తెలిపారు. చివరకు కంపెనీ ఆఫర్‌ను అంగీకరించినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: కంపెనీపై రూ.35.3 కోట్లు దావా వేసిన ఉద్యోగి

ఈ పోస్ట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. అందులో ఓ వ్యక్తి ‘ఇది చాలా సంతోషకర విషయం. ప్రతిభ కలిగిన ఉద్యోగులను సంతోషంగా ఉంచడానికి కంపెనీలు ఏమీ చేయడం లేదు. జీతాల పెంపు వల్ల కంపెనీలకు చాలా తక్కువే ఖర్చు అవుతుంది. కానీ వేతన పెంపు వల్ల ఉత్సాహంతో పని చేస్తే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయి’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement