మైక్రాన్‌ సెమీకండక్టర్‌ సెజ్‌  | Centre notifies SEZ reforms to boost semiconductor, electronics manufacturing | Sakshi
Sakshi News home page

మైక్రాన్‌ సెమీకండక్టర్‌ సెజ్‌ 

Jun 10 2025 4:42 AM | Updated on Jun 10 2025 9:34 AM

Centre notifies SEZ reforms to boost semiconductor, electronics manufacturing

గుజరాత్‌లో రూ. 13,000 కోట్ల భారీ పెట్టుబడి 

కర్ణాటకలో రూ. 100 కోట్లతో ’ఈక్వస్‌’ సెజ్‌ 

ప్రతిపాదనలకు కేంద్ర వాణిజ్య శాఖ ఆమోదం

న్యూఢిల్లీ: సెమీకండక్టర్లు, ఎల్రక్టానిక్స్‌ పరికరా ల తయారీకి సంబంధించి మరిన్ని ప్రత్యేక ఆర్థిక మండళ్లకు (సెజ్‌) కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ఇందులో మైక్రాన్‌ సెమీకండక్టర్‌ టెక్నాలజీ ఇండియా, హుబ్బళ్లి డ్యూరబుల్‌ గూడ్స్‌ క్లస్టర్‌ (ఈక్వస్‌ గ్రూప్‌) ప్రతిపాదనలు ఉన్నాయి. కేంద్ర వాణిజ్య శాఖ  ప్రకటన ప్రకారం గుజరాత్‌లోని సాణంద్‌లో మైక్రాన్‌ సుమారు 37.64 హెక్టార్ల విస్తీర్ణంలో సెజ్‌ ఏర్పాటు చేయనుంది. దీనిపై రూ. 13,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనుంది. మరోవైపు, కర్ణాటకలోని ధార్వాడ్‌లో ఈక్వస్‌ గ్రూప్‌ 11.55 హెక్టార్లలో ఎలక్ట్రానిక్స్‌ పరికరాల సెజ్‌ను నెలకొల్పనుంది. దీనిపై రూ. 100 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 

పెట్టుబడులు.. తయారీకి ఊతం
దేశీయంగా సెమీకండక్టర్లు, ఎల్రక్టానిక్స్‌ పరికరాల తయారీని ప్రోత్సహించే దిశగా సెజ్‌ నిబంధనలను సరళతరం చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ అధునాతన రంగాలు ప్రధానంగా దిగుమతులపైనే ఆధారపడి ఉండటం, తయారీ కార్యకలాపాలకు భారీగా పెట్టుబడుల అవసరం నెలకొనడం, లాభాలార్జించేందుకు సుదీర్ఘ సమయం పట్టేసే అవకాశం ఉండటం తదితర అంశాల నేపథ్యంలో పెట్టుబడులు, తయారీకి ఊతమిచ్చే విధంగా ప్రభుత్వం నిబంధలను సడలిస్తోందని వాణిజ్య శాఖ తెలిపింది. 

ఇందులో భాగంగా సెమీ కండక్టర్లు లేదా ఎలక్ట్రానిక్స్‌ పరికరాల తయారీ కోసం సెజ్‌లను ఏర్పాటు చేసేందుకు ఒకేచోట కనీసం 10 హెక్టార్ల స్థలం ఉంటే సరిపోతుందని పేర్కొంది. ప్రస్తుతం ఈ పరిమితి 50 హెక్టార్లుగా ఉంది. ఇక సెజ్‌లలోని సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్‌ పరికరాల తయారీ సంస్థలు అంతర్జాతీయంగానే కాకుండా, నిర్దిష్ట సుంకాలు చెల్లించిన మీదట దేశీయంగా కూడా విక్రయించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు వివరించింది. ఈ సవరణలన్నీ దేశీయంగా హైటెక్‌ తయారీకి, సెమీకండక్టర్ల తయారీ వ్యవస్థ అభివృద్ధికి, ప్రత్యేక నైపుణ్యాలు అవసరమయ్యే ఉద్యోగాల కల్పనకు దోహదపడతాయని పేర్కొంది. 2025 జూన్‌ 3న ఈ సవరణలను కేంద్ర వాణిజ్య శాఖ నోటిఫై చేసింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement