కొత్త రూల్స్.. పిల్లల భవిష్యత్తు కోసం కఠిన చర్యలు! | Britain Follows Australia Plans Social Media Ban For Children Under 16 | Sakshi
Sakshi News home page

కొత్త రూల్స్.. పిల్లల భవిష్యత్తు కోసం కఠిన చర్యలు!

Jun 15 2026 4:08 PM | Updated on Jun 15 2026 4:41 PM

Britain Follows Australia Plans Social Media Ban For Children Under 16

డిజిటల్ యుగంలో.. సోషల్ మీడియా పిల్లల జీవితాల్లో కీలక భాగంగా మారింది. అయితే, దీని వల్ల కలిగే మానసిక, సామాజిక ప్రభావాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కీర్ స్టార్‌మర్ (Keir Starmer) నేతృత్వంలోని యూకే ప్రభుత్వం 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా సైట్‌లను నిషేధిస్తానని, గేమింగ్, లైవ్‌స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లపై పరిమితులు విధిస్తానని నిర్ణయించింది. పిల్లల సంక్షేమాన్ని కాపాడటానికి కఠిన చర్యలు అవసరమని ప్రధాని స్పష్టం చేశారు.

బ్రిటన్ ప్రభుత్వం ఇటీవల సంవత్సరాలలో టెక్నాలజీ కంపెనీలపై కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. వయస్సు నిర్ధారణ వ్యవస్థలు, అల్గారిథమ్‌లలో మార్పులు, అనుచిత చిత్రాలను పంచుకోకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కంపెనీలను ఆదేశించింది. అయితే.. ఇప్పుడు కేవలం నియంత్రణలతో సరిపోదని భావించిన ప్రభుత్వం, పూర్తి నిషేధం వైపు అడుగులు వేస్తోంది.

బ్రిటన్ ప్రభుత్వం ఆస్ట్రేలియాను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఎందుకంటే.. గత ఏడాది ఆస్ట్రేలియా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా (టిక్‌టాక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్) వినియోగాన్ని నిషేధించిన తొలి దేశంగా నిలిచింది.

పిల్లలకు సోషల్ మీడియా నిషేధం గురించి నిర్ణయం తీసుకోవడానికి ముందు, బ్రిటన్ ప్రభుత్వం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, యువతతో విస్తృతంగా సంప్రదింపులు జరిపింది. సోషల్ మీడియాపై నిషేధంతో పాటు.. రాత్రి సమయాల్లో వినియోగ పరిమితులు, యాప్‌లకు సమయ పరిమితులు, పిల్లలను ఎక్కువసేపు ఆకర్షించే డిజైన్ ఫీచర్లపై ఆంక్షలు వంటి అంశాలను పరిశీలించింది.

ఈ సంప్రదింపుల్లో లక్షకు పైగా స్పందనలు వచ్చాయి. అందులో 83 శాతం మంది తల్లిదండ్రులు సోషల్ మీడియా వల్ల కలిగే నష్టాలు.. ప్రయోజనాల కంటే ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అలాగే 90 శాతం మంది సోషల్ మీడియా వాడేందుకు కనీస వయస్సు 16 సంవత్సరాలు ఉండాలని మద్దతు తెలిపారు.

అయితే.. ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. కొంతమంది మానసిక శాస్త్రవేత్తలు, పరిశోధకులు కేవలం నిషేధం విధించడం ద్వారా సమస్య పూర్తిగా పరిష్కారం కాదని అంటున్నారు. పిల్లలకు డిజిటల్ అవగాహన, బాధ్యతాయుతమైన వినియోగంపై విద్య అందించడం కూడా అంతే ముఖ్యమని వారు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి చర్యలు మరిన్ని దేశాలు తీసుకునే అవకాశం కూడా ఉంది.

ఇదీ చదవండి: క్యాష్ ఈజ్ ట్రాష్.. పెట్టుబడిదారులకు కియోసాకి హెచ్చరిక!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement