తమ వేతనం పెరగాలని ప్రతి ఉద్యోగి కోరుకుంటారు. ఇందు కోసం కంపెనీలు సైతం మారుతుంటారు. ఇది ఐటీ పరిశ్రమలో మరీ ఎక్కువ. అయితే ఇలాంటి ఉద్యోగ మార్పుల విషయంలో బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ నిపుణుడు ఉద్యోగులకు కీలక సూచన చేశారు. ప్రస్తుతం ఐటీ రంగంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో, చిన్న కంపెనీల నుంచి భారీ వేతన పెంపు ఆఫర్లు వచ్చినా వెంటనే ఆకర్షితులు కాకుండా, స్థిరత్వం ఉన్న పెద్ద సంస్థల్లో కొనసాగడాన్ని పరిశీలించాలని సూచించారు.
ఇన్స్టాగ్రామ్లో వైరల్గా మారిన వీడియోలో సన్నీ కుమార్ అనే టెకీ తన స్నేహితుడి అనుభవాన్ని ఉదాహరణగా వివరించాడు. పుణెలోని అంతర్జాతీయ చెల్లింపుల సంస్థ మాస్టర్కార్డ్లో మంచి వేతనం, స్థిరమైన ఉద్యోగంతో పనిచేస్తున్న అతనికి ఒక చిన్న కన్సల్టెన్సీ సంస్థ నుంచి 60 శాతం అధిక వేతనంతో ఆఫర్ వచ్చిందని తెలిపాడు. భారీ వేతన పెంపు కారణంగా అతను కొత్త కంపెనీలో చేరినప్పటికీ, కేవలం ఆరు నెలలకే ఆ సంస్థకు సంబంధించిన ప్రాజెక్టు నిలిచిపోవడంతో ఉద్యోగం కోల్పోయాడని వివరించాడు.
ఈ సంఘటనను ప్రస్తావిస్తూ, ఉద్యోగులు కేవలం వేతన పెంపును మాత్రమే ప్రమాణంగా తీసుకుని నిర్ణయాలు తీసుకోవద్దని కుమార్ సూచించాడు. మంచి సంస్థలో స్థిరమైన ఉద్యోగం ఉంటే 60 శాతం, 70 శాతం లేదా అంతకంటే ఎక్కువ వేతన పెంపు వచ్చినా, మార్కెట్ పరిస్థితులను జాగ్రత్తగా అంచనా వేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఐటీ రంగం వేగంగా మారుతున్నందున ఉద్యోగ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు.
అయితే ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పెద్ద కంపెనీలు కూడా ఇటీవల కాలంలో ఉద్యోగుల తొలగింపులకు పాల్పడుతున్నాయని పలువురు గుర్తు చేశారు. ఉద్యోగ భద్రత సంస్థ పరిమాణంపై మాత్రమే ఆధారపడదని, కంపెనీ ఆర్థిక పరిస్థితి, ఆదాయ వృద్ధి, ప్రాజెక్టుల స్థిరత్వం, భవిష్యత్ వ్యూహం, ఏఐ(AI) ప్రభావం వంటి అంశాలను కూడా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో పునర్వ్యవస్థీకరణలు, ఆటోమేషన్, ఏఐ వినియోగం పెరగడంతో ఉద్యోగ మార్కెట్లో పోటీ మరింత తీవ్రమైంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ మార్పు నిర్ణయాల సమయంలో వేతన పెంపుతో పాటు సంస్థ ఆర్థిక బలం, వ్యాపార నమూనా, మార్కెట్ అవకాశాలు, ఉద్యోగ భద్రత వంటి అంశాలను సమగ్రంగా అంచనా వేయడం అవసరమని కెరీర్ నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: ఐటీ కంపెనీలు కనుమరుగవుతాయా?


