ఐటీ ఉద్యోగుల పిల్లల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన డేకేర్ సెంటర్లో అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఐటీ రాజధాని బెంగళూరులో కలకలం రేపింది. ప్రముఖ ఐటీ దిగ్గజం క్యాప్జెమిని బెంగళూరు క్యాంపస్లోని డేకేర్ సెంటర్లో రెండు నుంచి మూడేళ్ల వయసున్న పసిబిడ్డలను తీవ్రంగా వేధించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో లీక్ కావడంతో ఐటీ వర్గాలతో పాటు ప్రజల్లో చర్చకు దారితీసింది.
బాత్రూమ్లో బంధించి..
జిల్లా పిల్లల సంరక్షణ యూనిట్ (డీసీపీయూ) అధికారి తిలకేష్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లోని అంశాలు కీలక విషయాలు వెల్లడించాయి. అందులోని వివరాల ప్రకారం.. పిల్లలు ఏడుస్తున్న సమయంలో సంరక్షకులు వారిని ఓదార్చాల్సింది పోయి శారీరకంగా బెదిరింపులకు గురిచేశారు. తల్లి పాలు కూడా మరువని పసిబిడ్డల నోటిలో బలవంతంగా నీరు పోశారు. వెస్ట్రన్ టాయిలెట్ కమోడ్లపై పిల్లలను బలవంతంగా కూర్చోబెట్టి బాత్రూమ్ లోపల వేసి తాళాలు పెట్టారు. వాట్సాప్లో హల్చల్ చేసిన వీడియోల ప్రకారం.. పిల్లలను భయపెట్టడానికి ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్ లోపల కూడా ఉంచినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఐదుగురు మహిళా కేర్టేకర్లపై కేసు నమోదు
ఈ అమానుష ఘటనపై జూన్ 29న బెంగళూరులోని హెచ్ఏఎల్ పోలీస్ స్టేషన్లో అధికారికంగా కేసు నమోదైంది. జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ) చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు మహిళా సంరక్షకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
స్పందించిన క్యాప్జెమిని
ఈ ఉదంతంపై తీవ్ర దుమారం రేగడంతో క్యాప్జెమిని యాజమాన్యం తక్షణమే స్పందించింది. జులై 1న కంపెనీ అధికారిక ప్రకటన విడుదల చేస్తూ బ్రూక్ఫీల్డ్ పరిధిలోని హెచ్ఏఎల్ క్యాంపస్లో ఉన్న ఆన్-క్యాంపస్ డేకేర్ సదుపాయాన్ని తాత్కాలికంగా వెంటనే మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ‘క్యాప్జెమిని సంస్థకు తన ఉద్యోగులు, వారి కుటుంబాల ఆరోగ్యం, భద్రత, శ్రేయస్సే అత్యంత ప్రధానం. ఈ ఘటనకు సంబంధించి వాస్తవాలను నిర్ధారించేందుకు దర్యాప్తు జరుపుతున్న అధికారులకు మేము పూర్తిస్థాయిలో సహకరిస్తున్నాం. ముందు జాగ్రత్త చర్యగా బెంగళూరు ఆన్-క్యాంపస్ డేకేర్ సదుపాయాన్ని తక్షణమే తాత్కాలికంగా మూసివేస్తున్నాం’ అని కంపెనీ అధికారిక ప్రతినిధి చెప్పారు.
ఇదీ చదవండి: బంగారం ధరలు కూల్ఆఫ్!


