న్యూఢిల్లీ: గృహోపకరణాల(హోమ్ అప్లయెన్సెస్) తయారీ కంపెనీ ఆటమ్బర్గ్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 450 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 7.65 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఏ91 పార్ట్నర్స్, వీసైన్స్ ఇన్వెస్ట్మెంట్స్(టెమాసెక్), జంగిల్ వెంచర్స్, స్టెడ్వ్యూ క్యాపిటల్ మారిషస్ తదితర సంస్థలు షేర్లను ఆఫర్ చేయనున్నాయి.
నిధుల వినియోగమిలా
ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 150 కోట్లు బ్రాండ్ ప్రమోషన్, మార్కెటింగ్కు కేటాయించనుండగా.. మరో రూ. 100 కోట్లు పరిశోధన, అభివృద్ధి(ఆర్అండ్డీ)పైనా వెచి్చంచనుంది. ఈ బాటలో రుణ చెల్లింపులకు రూ. 90 కోట్లు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. 2012లో మనోజ్ మీనా కంపెనీని ఏర్పాటు చేయగా.. 2013లో శివవ్రత దాస్ సహవ్యవస్థాపకుడిగా చేరారు. కంపెనీ ప్రధానంగా టెక్నాలజీ ఆధారిత కన్జూమర్ అప్లయెన్సెస్ రూపొందిస్తోంది.
మిక్సర్ గ్రైండర్స్, వాటర్ ప్యూరిఫయర్స్, కోల్డ్ ప్రెస్డ్ జ్యూసర్స్ తదితరాలను ఆటమ్బర్గ్ బ్రాండ్తో తయారు చేస్తోంది. అనుబంధ సంస్థ ఆటమ్బర్గ్ ఇన్నొవేషన్స్ మోటార్లు, కంట్రోలర్లు తదితర కీలక విడిభాగాల డిజైన్, సరఫరా చేపడుతోంది. కంపెనీ కస్టమర్లలో వోల్టాస్, గోద్రెజ్, బ్లూ స్టార్ తదితర దిగ్గజాలున్నాయి. గతేడాది(2025–26)లో ఆదాయం రూ. 1,294 కోట్లకు చేరగా.. రూ. 149 కోట్ల నికర నష్టం ప్రకటించింది. కంపెనీ ప్రధానంగా కన్జూమర్ అప్లయెన్సెస్, కీలక విడిభాగాల విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది.
ఇదీ చదవండి: స్టాక్మార్కెట్లో కొత్త ప్రయత్నం.. ‘డబుల్ ట్రేడింగ్’!


