
ముంబై: ఆరోగ్య సంరక్షణా సేవల దిగ్గజం అపోలో హాస్పిటల్స్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 54 శాతం జంప్చేసి రూ. 390 కోట్లను తాకింది. ఆదాయం పుంజుకోవడం ఇందుకు సహకరించింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 254 కోట్లు ఆర్జించింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 10 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది.
కాగా.. మొత్తం ఆదాయం రూ. 4,944 కోట్ల నుంచి రూ. 5,592 కోట్లకు ఎగసింది. పూర్తి ఏడాదికి కన్సాలిడేటెడ్ నికర లాభం 61 శాతం దూసుకెళ్లి రూ. 1,446 కోట్లను తాకింది. 2023–24లో రూ. 899 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 19,059 కోట్ల నుంచి రూ. 21,974 కోట్లకు బలపడింది. రానున్న ఐదేళ్లలో రూ. 8,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు సంస్థ చైర్మన్ ప్రతాప్.సి.రెడ్డి పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో సంస్థ షేరు బీఎస్ఈలో 0.7% బలపడి రూ. 6,878 వద్ద ముగిసింది.