అయ్యో అనిల్‌ అంబానీ! నీకే ఎందుకిలా ?

Anil Ambani Reliance Capital Q 3 Results - Sakshi

నష్టాల్లోనే రిలయన్స్‌ క్యాపిటల్‌

  క్యూ 3లో రూ. 1,759 కోట్ల నష్టం  

న్యూఢిల్లీ: వ్యాపారం దిగ్గజం ధీరుబాయి అంబానీ రెండో కుమారుడు అనిల్‌ అంబానీని కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే అనిల్‌ ఆధీనంలోని కంపెనీలు వరుసగా నష్టాలు ఎదుర్కొంటూ దివాలా దశకు చేరుకున్నాయి. తాజాగా ప్రకటించిన క్యూ 3 ఫలితాల్లోనూ ఎటువంటి మార్పు కనిపించలేదు. 

క్యూ 3 ఫలితాలు
దివాలా చట్ట చర్యలకు లోనైన రిలయన్స్‌ క్యాపిటల్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో మరోసారి నికర నష్టాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో రూ. 1,759 కోట్ల నష్టం ప్రకటించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 3,966 కోట్ల నష్టాలు నమోదుకాగా.. ఈ ఏడాది క్యూ2(జూలై–సెప్టెంబర్‌)లోనూ రూ. 1,156 కోట్ల నష్టం వాటిల్లింది. ఇక తాజా క్యూ3లో మొత్తం ఆదాయం రూ. 4,890 కోట్ల నుంచి రూ. 4,083 కోట్లకు క్షీణించింది. మొత్తం వ్యయాలు రూ. 5,658 కోట్లను తాకాయి. 2021 నవంబర్‌లో ఆర్‌బీఐ కంపెనీ బోర్డును రద్దు చేసిన సంగతి తెలిసిందే. 

సలహా కమిటీ
కంపెనీ పాలనాధికారిగా వై.నాగేశ్వరరావును నియమించడంతోపాటు బాధ్యతల నిర్వహణలో మద్దతిచ్చేందుకు ముగ్గురు సభ్యులతో సలహా కమిటీని ఏర్పాటు చేసింది. రుణదాతలు, డిబెంచర్‌ హోల్డర్లకు చెల్లింపుల విషయంలో కంపెనీ విఫలంకావడంతో దివాలా చర్యలవైపు ప్రయాణించింది. క్యూ 3 ఫలితాల నేపథ్యంలో రిలయన్స్‌ క్యాపిటల్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో యథాతథంగా రూ. 15.90 వద్ద ముగిసింది. 
 

చదవండి: రిలయన్స్‌ క్యాపిటల్‌ నిర్వాకం.. ఈపీఎఫ్‌వోకి రూ.3,000 కోట్ల నష్టం?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top