ఫార్చూన్‌ ‘40’లో అంబానీ వారసులు

Ambani Heirs Enter in Fortune 40 list - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ప్రభావశీలురైన ప్రముఖుల జాబితాలో పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ వారసులు ఆకాశ్‌ అంబానీ, ఈషా అంబానీ చోటు దక్కించుకున్నారు. అలాగే ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ స్టార్టప్‌ సంస్థ బైజూస్‌ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్‌కి కూడా స్థానం లభించింది. 40 ఏళ్ల లోపు వయస్సున్న 40 మంది ప్రముఖులతో ఫార్చూన్‌ మ్యాగజైన్‌ ఈ జాబితాను రూపొందించింది. ఈ ఏడాది ఆర్థికం, సాంకేతికత, వైద్యం, ప్రభుత్వం.. రాజకీయాలు, మీడియా.. వినోదరంగం అనే అయిదు కేటగిరీల నుంచి ప్రముఖులను ఎంపిక చేసింది. టెక్నాలజీ కేటగిరీలో ఈషా అంబానీ, ఆకాశ్‌ అంబానీ, బైజు రవీంద్రన్, షావోమీ ఇండియా ఎండీ మను కుమార్‌ జైన్‌ చోటు దక్కించుకున్నారు.

బ్రౌన్‌ యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్‌ డిగ్రీ పొందిన తర్వాత 2014లో ఆకాశ్‌ కుటుంబ వ్యాపారమైన రిలయన్స్‌లో చేరారు. యేల్, స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం చేసిన ఈషా ఆ మరుసటి ఏడాది కంపెనీలో చేరారు. రిలయన్స్‌లో భాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఫేస్‌బుక్‌ వంటి దిగ్గజాలు భారీగా ఇన్వెస్ట్‌ చేయడంలో జియో బోర్డు సభ్యులుగా వీరు తోడ్పాటు అందించినట్లు ఫార్చూన్‌ పేర్కొంది. అలాగే రిలయన్స్‌ సామ్రాజ్యాన్ని నడిపించేందుకు అవసరమైన శిక్షణ పొందుతున్నారని తెలిపింది. మరోవైపు, భారీ స్థాయిలో ఆన్‌లైన్‌ విద్యా సంస్థను నెలకొల్పడం సాధ్యమేనని రవీంద్రన్‌ నిరూపించారని ఫార్చూన్‌ పేర్కొంది. అటు స్టార్టప్స్‌ ఏర్పాటు చేసిన అనుభవం తప్ప స్మార్ట్‌ఫోన్స్‌ గురించి అంతగా తెలియని మను జైన్‌ .. చైనా కంపెనీ షావోమీ భారత్‌లో కార్యకలాపాలను భారీగా విస్తరించేందుకు తోడ్పడ్డారని తెలిపింది.

చదవండి: బ్లూచిప్‌ షేర్ల దన్ను

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top