ఎయిరిండియా సిబ్బందికి కొత్త యూనిఫాం.. ఎలా ఉందో చూశారా? | Air India Unveils New Uniforms | Sakshi
Sakshi News home page

ఎయిరిండియా సిబ్బందికి కొత్త యూనిఫాం.. ఎలా ఉందో చూశారా?

Dec 12 2023 8:09 PM | Updated on Dec 12 2023 10:06 PM

Air India Unveils New Uniforms - Sakshi

డైవర్సిఫైడ్‌ దిగ్గజం టాటా గ్రూప్‌ ఆధీనంలో ఉన్న ప్రముఖ ఏవియేషన్‌ సంస్థ ఎయిరిండియాని ప్రపంచ స్థాయి విమానయాన సంస్థ తీర్చిదిద్దేలా ముందుకు సాగుతుంది. ఇప్పటికే ఆ సంస్థ లోగోని మార్చిన యాజమాన్యం.. తాజాగా అందులో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ధరించేందుకు కొత్త యూనిఫామ్‌ను అందుబాటులోకి తెచ్చింది. 

త‌న క్యాబిన్ సిబ్బంది, పైల‌ట్ల‌కు ప్ర‌ముఖ డిజైన‌ర్ మ‌నీష్ మ‌ల్హోత్రాతో యూనిఫాంను డిజైన్‌ చేయించింది. మహిళా క్యాబిన్‌ సిబ్బందికి మోడ్రన్‌ లుక్‌లో ఓంబ్రే చీరలు, పురుషులకు బ్యాండ్‌గ్లస్‌, కాక్‌పిట్‌లో విధులు నిర్వహించే ఉద్యోగులు క్లాసిక్‌ బ్లాక్‌ సూట్స్‌ ఉన్నాయి.  

ఈ కొత్త యూనిఫామ్‌ను దశల వారీగా పూర్తిస్థాయిలో పరిచయం చేసేలా ఎయిరిండియా భావిస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న నెలల్లో ఎయిరిండియా తొలి ఎయిర్‌ బస్‌ ఏ350 సర్వీసుల్ని ప్రారంభించనుంది. ఆ సమయంలో ఈ కొత్త యూనిఫామ్‌ను ధరించి సిబ్బంది విధులకు హాజరవుతారని సమాచారం.  

మహిళా సిబ్బంది యూనిఫాం ఎలా ఉండబోతుందంటే?
మహిళా సిబ్బందికి ఈజీగా, స్టైలిష్‌గా, యూనిక్‌ లుక్‌లో సంప్రదాయాన్ని మేళవించేలా ఈ కొత్త యూనిఫాం ఆకట్టుకుంటుందని ఎయిరిండియా ఓ ప్రకటనలో పేర్కొంది. సీనియర్ మహిళా క్యాబిన్ సిబ్బంది కోసం ఓంబ్రే చీరలు, వంకాయ బ్లేజర్‌లతో కలిపి ఎరుపు-గోధుమ రంగులో ఉంటాయి. జూనియర్ మహిళా క్యాబిన్ సిబ్బంది ఎరుపు రంగు బ్లేజర్‌లతో కలిపి ఎరుపు - ఊదా రంగు చీరలను ధరిస్తారు. కాక్‌పిట్ సిబ్బంది యూనిఫారం క్లాసిక్ బ్లాక్ డబుల్ బ్రెస్ట్‌డ్ సూట్‌ను అందంగా డిజైన్‌ చేశారు మల్హోత్రా.  

ఈ సందర్భంగా మనీష్ మల్హోత్రా మాట్లాడుతూ “ఎయిరిండియా కోసం యూనిఫాం డిజైన్ చేసే అవకాశం నాకు లభించినందుకు గౌరవంగా భావిస్తున్నాను. జాతీయ జెండాను మోసే (రతన్‌ టాటాను ఉద్దేశిస్తూ) వ్యక్తికి ఫ్యాషన్‌ విభాగం నుంచి దోహదపడటం ఆనందంగా ఉంది. నా లక్ష్యం దేశ విభిన్న సంస్కృతి, సంప్రదాయాల సారాంశం ఉట్టిపడేలా యూనిఫారాలను రూపొందించడం, ఆధునిక అధునాతన డిజైన్‌లను అందించడమేనని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement