భారత డిజిటల్ ఐడెంటిటీ వ్యవస్థ అయిన ఆధార్ వినియోగం అంచనాలకు మించి వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రోజుకు సుమారు 10 కోట్ల (100 మిలియన్ల) ఆధార్ ప్రామాణీకరణలను నిర్వహిస్తున్న వ్యవస్థను భవిష్యత్తులో రోజుకు 25–30 కోట్ల ప్రామాణీకరణలు నిర్వహించే స్థాయికి విస్తరించేందుకు మౌలిక వసతులను సిద్ధం చేస్తున్నట్లు యూఐడీఏఐ చైర్మన్ నీలకంఠ మిశ్రా తెలిపారు. ముంబైలో జరుగుతున్న గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్ 2026లో ఆయన ఈ వివరాలను వెల్లడించారు.
ఆధార్ యాప్కు పెరుగుతున్న ఆదరణ
దేశవ్యాప్తంగా డిజిటల్ సేవల విస్తరణతో ఆధార్ వినియోగం మరింత పెరుగుతోందని చెప్పారు. ప్రస్తుతం 600కుపైగా సంస్థలు తమ సేవలు, ప్రక్రియల్లో ఆధార్ను ఉపయోగిస్తున్నాయని వెల్లడించారు. ఇక కొత్త ఆధార్ యాప్కు ఆదరణ విపరీతంగా పెరుగుతోందన్నారు. యాప్ డౌన్లోడ్లు కొన్ని వారాల్లోనే సుమారు 5 కోట్ల నుంచి దాదాపు 6 కోట్లకు పెరిగాయన్నారు. ఈ యాప్ ద్వారా ఆధార్ కేంద్రానికి వెళ్లకుండానే నమోదైన మొబైల్ నంబర్, చిరునామా వంటి వివరాలను అప్డేట్ చేసుకునే సదుపాయం ఉంది.
క్వాంటమ్ ముప్పును ఎదుర్కొనేందుకు కొత్త భద్రత
ఆధార్ మౌలిక వసతుల విస్తరణతో పాటు సైబర్ భద్రతకు యూఐడీఏఐ అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. వచ్చే దశాబ్దానికి సంబంధించిన టెక్నాలజీ రోడ్మ్యాప్లో భాగంగా పోస్ట్-క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ (PQC)పై పనిచేస్తున్నట్లు మిశ్రా తెలిపారు. భవిష్యత్తులో శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటర్లు ప్రస్తుత పబ్లిక్-కీ క్రిప్టోగ్రఫీ వ్యవస్థలకు ముప్పుగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ చర్యలు చేపడుతున్నారు. ఇదే సమయంలో ఆధార్ మౌలిక వసతులపై ప్రతిరోజూ వందలాది సైబర్ దాడుల ప్రయత్నాలు జరుగుతున్నాయని మిశ్రా తెలిపారు. వాటిని ఎదుర్కొనేందుకు ఇప్పటికే పలు రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఇదీ చదవండి: ఉద్యోగం మారితే EPF ఏమౌతుంది?


