ఒకరోజు ఉదయం నిద్రలేచి ఈమెయిల్ చూడగానే.. 'ఈరోజే మీ చివరి పని రోజు' అని మెయిల్ వస్తే ఎలా ఉంటుంది?. ఒరాకిల్ సంస్థలో పనిచేసే కొంతమంది ఉద్యోగులకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఉదయం సుమారు 6 గంటల సమయంలో వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు.. అదే రోజు చివరి పని దినమని కంపెనీ నుంచి సమాచారం వచ్చింది.
ఉద్యోగుల తొలగింపుకు కారణం.. కంపెనీలో జరుగుతున్న విస్తృత సంస్థాగత మార్పులు అని ఈమెయిల్లో పేర్కొన్నారు. అంతే కాకుండా.. ఉద్యోగులు ఉపయోగిస్తున్న కంపెనీ కంప్యూటర్లు, ఈమెయిల్, వాయిస్మెయిల్, ఫైల్స్ వంటి సిస్టమ్లకు యాక్సెస్ త్వరలో నిలిపివేస్తామని వెల్లడించారు. భవిష్యత్లో సీవరెన్స్ (ఉద్యోగం ముగిసినప్పుడు ఇచ్చే పరిహారం), ఇతర పత్రాల కోసం వ్యక్తిగత ఈమెయిల్ చిరునామా ఇవ్వాలని సూచించారు.
ఒరాకిల్ ప్రస్తుతం ఏఐ రంగంలో భారీ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి.. డేటా సెంటర్లు, క్లౌడ్ కంప్యూటింగ్, ఇతర మౌలిక సదుపాయాలపై భారీగా ఖర్చు చేస్తోంది. 2027 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ సుమారు 28.5 బిలియన్ డాలర్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసింది. గత ఏడాది ఇదే సమయంలో ఖర్చు చేసిన దానికంటే.. ఇది మూడు రెట్లకంటే ఎక్కువ.
అంతేకాకుండా.. మొత్తం ఆర్థిక సంవత్సరానికి ఒరాకిల్ 90-95 బిలియన్ డాలర్ల వరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలని అంచనా వేసింది. ఏఐ క్లౌడ్ సేవలకు డిమాండ్ కూడా చాలా బలంగా ఉంది. ఒక్క త్రైమాసికంలోనే 30 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన అదనపు ఏఐ క్లౌడ్ ఒప్పందాలు కుదిరినట్లు ఒరాకిల్ తెలిపింది.
అయితే.. ఇంత భారీగా పెట్టుబడులు పెట్టడం వల్ల కంపెనీపై ఆర్థిక ఒత్తిడి కూడా పెరుగుతోంది. కాబట్టి ఒరాకిల్ ఒక కఠినమైన సమతుల్యతను పాటించాల్సి వస్తోంది. ఒకవైపు ఏఐ భవిష్యత్తు కోసం భారీగా పెట్టుబడి పెట్టాలి.. మరోవైపు ఖర్చులను నియంత్రించాలి. ఈ కారణంగానే ఉద్యోగాల తొలగింపు చేపట్టినట్లు స్పష్టమవుతుంది.
ఇదీ చదవండి: ఉద్యోగులకు షాక్.. టెక్ దిగ్గజంలో మరోమారు లేఆఫ్స్!


