● ఏపీ నుంచి తెలంగాణ అటవీ ప్రాంతంలోకి.. ● అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు
అశ్వారావుపేటరూరల్: ఏపీలోని ఏలూరు జిల్లా బుట్టాయగూడెం, జీలుగుమిల్లి అటవీ ప్రాంతాల్లో గడిచిన కొద్ది రోజులుగా సంచరిస్తున్న పెద్దపులి తాజాగా శుక్రవారం అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల అడవిలోకి వచ్చినట్లు స్థానిక అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 2న జీలుగుమల్లి మండలం స్వర్ణవారిగూడెం సమీపంలో పులి దాడి చేసి ఓ గేదెను చంపివేసింది. గతంలో పులికి అమర్చిన జీపీఎస్ ట్రాక్ సిగ్నల్ ద్వారా పులి సంచారం గుర్తించి, వలలు, బోన్లు ఏర్పాటు చేసి బంధించేందుకు అక్కడి అటవీ, పోలీస్ శాఖల అధికారులు ప్రయత్నం చేశారు. కానీ ఆచూకీ కచ్చితంగా గుర్తించలేక పోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పులి ఏపీ సరిహద్దు ప్రాంతాన్ని దాటి శ్రీ గుబ్బల మంగమ్మ ఆలయ పరిసరాల మీదుగా అశ్వారావుపేట మండలంలోని కావడిగుండ్ల దట్టమైన అటవీ ప్రాంతానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా జీపీఎస్ సిగ్నల్ కావడిగుండ్ల అటవీ ప్రాంతంలో చూపుతున్న నేపథ్యంలో స్థానిక అటవీ, పోలీస్ శాఖ అధికారులు అప్రమత్తయ్యారు. స్థానికులను అప్రమత్తం చేసి అటవీ ప్రాంతాల్లోకి వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. కాగా, ఈ ఏడాది జనవరి 20, 21వ తేదీల్లో కావడిగుండ్ల అటవీ ప్రాంతంలో సంచరించిన పులి, తిరిగి ఈ ఏడాది జూన్ 28వ తేదీన రెండోసారి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ తాజాగా ఏపీ నుంచి కావడిగుండ్ల వైపు రావడంతో ఈ ప్రాంత వాసులంతా భయందోళన చెందుతున్నారు.


