● ఏకకాలంలో ఉత్తర, దక్షిణ, పడమర దిక్కుల్లో అభివృద్ధి పనులు ● విస్తా కాంప్లెక్స్ తొలగింపునకు ప్రణాళికలు
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామివారిని ఇకనుంచి తూర్పు వైపు నుంచే దర్శనం చేసుకోవాలి. ఇప్పటికే దక్షిణం, ఉత్తరం వైపు అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆ దారులను మూసివేశారు. ఉత్తరం ద్వార దర్శన వేదిక, మెట్లను ఇప్పటికే పడగొట్టగా, ప్రాకారం సైతం కూల్చివేయనున్నారు. పడమర వైపు మెట్లను తొలగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పడమర వైపు భక్తులు భద్రపర్చుకునే సెల్ఫోన్, చెప్పులు స్టాండ్లను తూర్పు వైపునకు మార్చనున్నారు. ఇందుకోసం ఖాళీ స్థలంలో తాత్కాలిక షెడ్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీంతో ఉత్తరం, దక్షిణం, పడమర మూడు దిక్కుల్లో ఏకకాలంలో పనులు జరగనున్నాయి. చిత్రకూట మండపం తొలగింపు ప్రక్రియ మరో రెండు రోజుల్లో పూర్తి కానుంది. మిథిలా స్టేడియంలో నిర్మిస్తున్న తాత్కాలిక నిత్యకల్యాణ వేదిక పనులు పూర్తి కావొస్తున్నాయి. విస్తా కాంప్లెక్స్ తొలగింపు పనులపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. విస్తా కాంప్లెక్స్ తొలగిస్తే తమ జీవనోపాధికి ఇబ్బందులు ఏర్పడతాయని గదులను వేలం పాట పాడుకున్న దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వారికి తాత్కాలికంగా పరిసర ప్రాంతాల్లోనే దుకాణాలకు వెసులుబాటు కల్పించాలనే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు.


