వరి సాగుతో నష్టపోవద్దు
నీరు వచ్చే పరిస్థితి లేదు
ఎల్నినో, వర్షపాతం లోటును ఎదుర్కొనేలా కార్యాచరణ
వరి సాగు చేయకుండా
రైతులకు విస్తృత అవగాహన
ఉమ్మడి జిల్లాస్థాయి సమీక్షలో రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఖమ్మం సహకారనగర్: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యాన వాస్తవాలను క్షేత్రస్థాయిలో ప్రజలు, రైతులకు చేరవేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ఎల్నినో ప్రభావంతో ఏర్పడే పరిస్థితులపై శాసీ్త్రయ అంచనాలు, క్షేత్రస్థాయి వాస్తవాలపై అంచనాకు వచ్చిన అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తే సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్లో సోమవారం ఎల్నినో సంసిద్ధతమై ఉమ్మడి జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టితో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన్, ఉద్యానశాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా, ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు దివాకర టీ.ఎస్., అంకిత్, వైరా, భద్రాచలం ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, తెల్లం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
ఏడాది ప్రణాళిక ఉండాలి
రానున్న మూడు నెలలకే పరిమితం కాకుండా కనీసం ఏడాది కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి అనుదీప్ దురిశెట్టి సూచించారు. మండలాల వారీగా పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. మండల, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి వర్షపాతం, తాగునీరు, భూగర్భ జలాలు, విద్యుత్ సరఫరా, పంటల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ సంపత్ ఎల్నినో పరిస్థితులపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈనెల 15నాటికి ఉమ్మడి జిల్లాలో 35 శాతం లోటు వర్షపాతం ఉన్నా, రైతులు ప్రస్తుతం పత్తి అధికంగా సాగు చేశారని తెలిపారు. వర్షాలు వస్తే వరి సాగుకు సిద్ధమవుతున్నారని, భూగర్భ జలాలు ఉన్న వారు నార్లు పోశారని అధికారులు అధికారులు వివరించారు. అనంతరం తెలంగాణ జలసిరి, ఎల్నినో సూపర్ స్థితిలో తీసుకునే చర్యలపై కరపత్రాలు ఆవిష్కరించారు. ఇంకా ఈ సమావేశంలో పోలీస్కమిషనర్ సునీల్దత్, భద్రాద్రి ఎస్పీ రోహిత్రాజ్, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
వర్షాభావం దృష్ట్యా రానున్న రెండు నెలల్లో భూగర్భ జలాలు మరింత తగ్గే అవకాశం ఉన్నందున రైతులెవరూ వరి సాగు చేయొద్దద్దని డిప్యూటీ సీఎం భట్టి సూచించారు. . గత ఏడాది, ఈ ఏడాది నీటి వనరుల లభ్యత, జలాశయాల్లో నీటి నిల్వలు, భూగర్భ జలాల పరిస్థితిపై సమగ్ర నివేదికను అందుబాటులో ఉంచాలన్నారు.
ప్రతీ గ్రామంలో వర్షపాతం పరిస్థితులు, నీటి వనరుల లభ్యత, భూగర్భ జలాల పరిస్థితిపై రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. నీటి లభ్యత ఆధారంగానే పంటలు ఎంపిక చేసుకునేలా ప్రచారం చేయాలన్నారు. నీరు అధికంగా అవసరముండే వరి తదితర పంటలను ప్రోత్సహించకుండా, పెసర, మినుములు, కందులు, చిరుధాన్యాలు సాగుచేసేలా అవగాహన కల్పించాలన్నారు. బోర్ల ఆధారంగా వరి సాగు చేస్తే ఆగస్టు, సెప్టెంబర్ల్లో నీటి సమస్య మరింత తీవ్రమైతే ఇబ్బంది పడతారని తెలిపారు. ఇదే సమయాన ఉమ్మడి జిల్లాల్లో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ప్రస్తుతం వైరా, లంకా సాగర్ జలాశయాలను తాగునీటి అవసరాల కోసమే నింపుతున్నామని వెల్లడించారు.


