రైల్వేలైన్.. పరిహారం లేట్
మార్కెట్ ధరపై పది రెట్లు పెంచి
ఇవ్వాలని వినతులు
ఎటూ తేల్చకపోవడంతో
నిర్వాసితుల ఎదురుచూపులు
కారేపల్లి: డోర్నకల్ నుంచి భద్రాచలం రోడ్డు(కొత్తగూడెం) వరకు కారేపల్లి జంక్షన్ మీదుగా రైల్వే డబ్లింగ్ లైన్ నిర్మాణానికి సిద్ధమయ్యారు. ఈక్రమాన భూమి సేకరించాల్సి ఉండగా వ్యవసాయ భూములు, ఇళ్లకు పరిహారం లెక్క కట్టడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఆరు నెలలుగా సర్వేలు, గ్రామసభలు కొనసాగుతున్నా పరిహారంపై స్పష్టత ఇవ్వకపోవడంతో వ్యవసాయ భూములు కోల్పోనున్న రైతులు, ఇళ్లు, ఇళ్ల స్థలాలు కోల్పోనున్న ప్రజలు ఎదురుచూస్తూ కాలం గడపాల్సి వస్తోంది. అయితే, మార్కెట్ ధరపై పది రెట్లు పరిహారం ఇవ్వాలనే డిమాండ్ను పరిగణనలోకి తీసుకుంటారా లేక నామమాత్రంగా చెల్లిస్తే తాము బతకడం ఎలా అన్న ప్రశ్నలు వారిని వేధిస్తున్నాయి.
మండలంలో 54 ఎకరాలు
కారేపల్లి మండలంలోని కమలాపురం, గేటుకారేపల్లి, కారేపల్లి, గాంధీనగర్, చీమలపాడు, రేలకాయపల్లి గ్రామాల్లో రైల్వే డబ్లింగ్ లైన్ నిర్మాణం కోసం భూసేకరణ చేయాలని నిర్ణయించారు. ఆయా గ్రామాల్లో 54 ఎకరాలు అవసరమని గుర్తించిన రైల్వే అధికారులు సర్వే కూడా చేశారు. ఇందులో సింగరేణి రెవెన్యూలో 60 – 70 మంది రైతుల నుంచి 11.35 ఎకరాల వ్యవసాయ భూమి సేకరించాల్సి ఉంది. అలాగే, కారేపల్లి స్టేషన్ విస్తరణ, రెండో ప్లాట్ఫాం, అదనపు ట్రాక్ల నిర్మాణానికి 20 కుటుంబాలు ఇళ్లు కోల్పోవాల్సి వస్తోంది. ట్రాక్ నుంచి 45 మీటర్ల మేర వ్యవసాయ భూమి, రైల్వేస్టేషన్ పరిధిలో 65మీటర్ల మేర భూమితో పాటు పలువురి ఇళ్లు సేకరించాల్సి ఉండగా.. అధికారులు మార్కింగ్ సైతం వేశారు.
నెలలు గడుస్తున్నా
కొలిక్కిరాని ధర


