చీకటి గోపి మృతిపై కేసు నమోదు
తాడికొండ: తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన చీకటి గోపిని కేసు విచారణలో భాగంగా తాడికొండ పోలీస్స్టేషన్కు తీసుకొచ్చి కొట్టినట్లు ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడికొండ పోలీస్స్టేషన్లో మంగళవారం రాత్రి కేసు నమోదు చేశారు. కేసు విచారణాధికారిగా మేడికొండూరు సీఐ మధుసూధనరావును నియమించడంతో ఆయన పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం విచారణలో భాగంగా బుధవారం సాయంత్రం ఆయన తాడికొండ పోలీస్స్టేషన్ను సందర్శించారు. ఈ కేసులో పోస్టుమార్టం నివేదిక అనంతరం మృతుడి ఒంటిపై ఉన్న గాయాలకు కారణాలు ఏంటి అనే విషయాలు గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పోలీస్ స్టేషన్లోని సీసీ టీవీ పుటేజీలను స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా తెనాలిలో అవినీతి ఆరోపణలు ఎదుక్కొని వీఆర్లో ఉంటూ తాడికొండకు పోస్టింగ్పై వచ్చిన ఓ కానిస్టేబుల్తో పాటు తాడికొండలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న మరో కానిస్టేబుల్ కేసు విచారణలో భాగంగా మృతుడిని కొట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోస్టుమార్టం పూర్తి నివేదిక అంది విచారణ జరిగితే కానీ విషయాలు బయటకు వచ్చే అవకాశం లేదు.
పోస్టుమార్టం ప్రక్రియ వీడియో రికార్డింగ్..
గుంటూరు మెడికల్: చోరీ కేసులో విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్కు వెళ్లిన తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన చీకటి గోపి గుంటూరు జీజీహెచ్లో మంగళవారం మృతిచెందడంతో కుటుంబ సభ్యులు గుంటూరు జీజీహెచ్లో ఆందోళన చేసిన విషయం విధితమే. పోలీసుల లాఠీ చార్జి వల్లే గోపి చనిపోయాడంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించడంతో బుధవారం గోపి పోస్టుమార్టం ప్రక్రియను వీడియో రికార్డింగ్ ద్వారా పూర్తి చేశారు.
కొనసాగుతున్న సీనియర్ వైద్యుల నిరసన
గుంటూరు మెడికల్: గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ ఆధ్వర్యంలో ఆగస్టు 19 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా గుంటూరు మెడికల్ కాలేజ్, ప్రొఫెసర్లు బుధవారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గుంటూరు మెడికల్ కాలేజీ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ దేవ కుమార్ మాట్లాడుతూ 2016 నుంచి రావాల్సిన జీతం బకాయిలు చెల్లించాలని, 2026 జనవరి నుంచి ఇవ్వాల్సిన 8వ యూజీసీ వేతనాల సవరణ, ఇతర డిగ్రీ కాలేజ్ బోధకులకు ఇచ్చినట్లే, యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ రాజా కుమార్, డాక్టర్ గాజుల రామకృష్ణ, డాక్టర్ స్వరూప్ కాంత్, డాక్టర్ ఉషారాణి, డాక్టర్ కమల రాజేశ్వరి, సునీత పాల్గొన్నారు.


