డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల కేటాయింపుపై పెద్దఎత్తున విమర్శలు దృష్టి మళ్లించేందుకు టీడీపీ స్కిట్ల రాజకీయం! ప్రభుత్వ చర్యలపై మండిపడుతున్న జనం
అనగాని ఆధ్వర్యంలో నాటకాలు
రేపల్లె: డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో చోటుచేసుకున్న అవకతవకలపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు మిన్నంటుతున్న వేళ అసలు అంశంపై సమాధానం చెప్పాల్సిన టీడీపీ ప్రభుత్వం మాత్రం రాజకీయ నాటకాలతో ప్రజల దృష్టిని మరల్చే యత్నం చేస్తోంది. నిజమైన అర్హత కలిగిన అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై స్పష్టత ఇవ్వాల్సిన ప్రభుత్వం స్కిట్ల రూపంలో ప్రచార హంగామాకు దిగడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక జనరల్ కోటాలో ఎంపికై న అభ్యర్థులను రంగంలోకి దించిన టీడీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పించే ప్రయత్నం జరుగుతోందని రాజకీయ వర్గాలు మండిపడుతున్నాయి.
అసలు వివాదం స్పోర్ట్స్ కోటానే కదా!
అసలు వివాదం స్పోర్ట్స్ కోటా చుట్టూనే తిరుగుతుండగా పరీక్షల ప్రక్రియ లేకుండానే స్కూల్ గేమ్స్, కాలేజీ గేమ్స్, బ్రిడ్జ్ గేమ్స్ వంటి సర్టిఫికెట్ల ఆధారంగా ఉద్యోగాలు ఎలా కేటాయించారో వెల్లడించాలన్న డిమాండ్లు ప్రజల్లో రోజురోజుకీ ఉధృతమవుతున్నాయి. కష్టపడి చదివి, పరీక్షలు రాసి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులపై ఎలాంటి విమర్శలు లేవని, అలాంటి వారిని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం దారుణమని విద్యావేత్తలు మండిపడుతున్నారు. అర్హత ఉన్నవారిని కవచంగా పెట్టి అక్రమాలను కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ప్రజా సమస్యలపై సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం స్కిట్లు, స్టేజ్ షోలు, ప్రచార డ్రామాలతో నిజాలను దాచిపెట్టాలని చూస్తోందన్న విమర్శలు మరింత తీవ్రతరం అవుతున్నాయి. స్కిట్లు వేసి సత్యాన్ని దాచగలమా అనే ప్రశ్న ఇప్పుడు సామాన్య ప్రజల నోట వినిపిస్తోంది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే స్పోట్స్ కోటాలో ఎలాంటి పరీక్షలు లేకుండానే ఉద్యోగాలు పొందిన వారి పూర్తి వివరాలు బహిర్గతం చేయాలని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేకపోతే ఈ వ్యవహారం ప్రభుత్వంపై మరింత మచ్చగా మిగిలిపోతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
రేపల్లె శాసనసభ్యుడు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్వయంగా స్కిట్లకు ప్రోత్సాహం ఇవ్వడం ప్రజల్లో వ్యంగ్యానికి కారణమైంది. సమస్యల నుంచి తప్పించుకోవడానికి స్కిట్ల రాజకీయమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. డీఎస్సీ జనరల్ కోటాలో ఎంపికై న టీచర్ అభ్యర్థులను రేపల్లె పట్టణంలో ఇటీవల అనగాని సత్యప్రసాద్ స్వయంగా కలసి కూటమి ప్రభుత్వాన్ని పొగిడిస్తూ చేసిన స్కిట్లు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమస్యల నుంచి తప్పించుకోవడానికి స్కిట్ల రాజకీయమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.


