జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్
బాపట్ల: ప్రత్యేక సమగ్ర సవరణ జాబితాలో ఓటర్ల పరిశీలన, అభ్యంతరాలపై దరఖాస్తుల స్వీకరణ, పరిష్కార ప్రక్రియ గడువు ఈనెల 10వ తేదీ వరకు ఎన్నికల కమిషన్ పొడిగించిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ తుది జాబితాను అక్టోబర్ 9వ తేదీన ముద్రిస్తామని కలెక్టర్ తెలిపారు. ఆ మేరకు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను జారీ చేసిందన్నారు. అభ్యంతరాలపై దరఖాస్తుల పరిశీలన, పరిష్కరించే ప్రక్రియ గడువు ముగిసినప్పటికీ ఈనెల 10వ తేదీ వరకు ఎన్నికల కమిషన్ పొడిగించిందన్నారు. అలాగే నోటీసులు జారీ చేసిన తదుపరి అభ్యంతరాలపై ఓటర్ల నుంచి ఈనెల 5వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించడానికి ఎన్నికల కమిషన్ అనుమతించిందన్నారు. ఓటర్లు గుర్తించి తక్షణమే దరఖాస్తులను సదరు అధికారులకు అందించాలన్నారు. గడువు పొడిగించిన నేపథ్యంలో ఈనెల ఐదు, ఆరు తేదీలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఓటర్లు ఈ విషయాలను గుర్తించి సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఓట్లను వేగంగా పరిశీలించుకోవాలి
ప్రత్యేక సమగ్ర సవరణ జాబితా కోసం ఓట్లపై నమోదైన దరఖాస్తులను వేగంగా పరిశీలిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో తొమ్మిది లక్షల మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు ఆరు లక్షలకు పైగా ఓటర్లను సమగ్రంగా పరిశీలించి, తుది జాబితాలో ముద్రణకు సిద్ధం చేశామన్నారు. మిగిలిన రెండున్నర లక్షల మంది ఓటర్ల వివరాల పరిశీలన ప్రక్రియ సాగుతుందన్నారు. ప్రస్తుతం ఫారం–6 కింద నమోదైన 5,287 దరఖాస్తులు, ఫారం–7 కింద నమోదైన 63 దరఖాస్తులు, ఫారం–8 కింద నమోదైన 3,583 దరఖాస్తులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయన్నారు. అదనంగా ఏఈఆర్ఓలను నియమించడం ద్వారా ఓటర్ల దరఖాస్తులు పరిశీలన, విచారణ ప్రక్రియ వేగంగా సాగుతుందన్నారు. తాజాగా పొడిగించిన గడువులోగా ఓటర్ల పరిశీలన, పరిష్కార ప్రక్రియ ముగిస్తామని తెలిపారు.


