చీరాల: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు చీరాల ఎన్ఆర్పీఎం హైస్కూల్లో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్న బేతాళ సాల్మన్ ఎంపికయ్యారు. పట్టణంలోని పేరాలకు చెందిన బేతాళ సాల్మన్ 1990 సంవత్సరంలో స్కూల్ అసిస్టెంట్గా పేరాలలోని ఆంధ్రరత్న మున్సిపల్ హైస్కూల్లో చేరారు. విద్యాబుద్ధులు నేర్చుకున్న పాఠశాలలోనే ఉపాధ్యాయుడిగా అడుగుపెట్టి 29 సంవత్సరాల పాటు గణిత ఉపాధ్యాయుడిగా పని చేశారు. అనంతరం ఆరు సంవత్సరాల పాటు ప్రధానోపాధ్యాయుడిగా అదే పాఠశాలలో పనిచేశారు. ప్రస్తుతం చీరాలలోని ఎన్ఆర్పీఎం హైస్కూల్లో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. 36 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఆయన ఉద్యోగంలో చేరిన ఎనిమిది సంవత్సరాల్లోనే అంటే 1998లో జిల్లా ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. చదువుకున్న పాఠశాలలోనే ఉపాధ్యాయుడిగా అవకాశం రావడం, అదే పాఠశాలలో 35 సంవత్సరాల పాటు పనిచేశారు. 112 సంవత్సరాల చరిత్ర ఉన్న చీరాల ఎన్ఆర్పీఎం హైస్కూల్లో ప్రధానోపాధ్యాయుడిగా పాఠశాలకు అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారు. పాఠశాలను అందంగా తీర్చిదిద్దడంతో పాటు పదో తరగతి ఫలితాల్లోనూ మంచి మార్కులు సాధించేలా విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చారు. ఎంతో మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పడం అదృష్టంగా భావిస్తున్నానని, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని అయన అన్నారు. అలానే ఎన్సీసీలోనూ ప్రతిభను చాటారు. ఎన్సీసీ బెస్ట్ ఆఫీసర్గా అవార్డులు అందుకోవడంతో పాటు ఎంతో మంది విద్యార్థులను ఎన్సీసీ పరేడ్లకు పంపి వారికి ఉన్నత భవిష్యత్తును అందించారు. ఎన్సీసీలో అందించిన సేవలకు గాను ఆయనకు ఎయిర్ గన్ రైఫిల్ను ఎన్సీసీ ఉన్నతాధికారులు అందించడం విశేషం. బేతాళ సాల్మన్ను పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు.


