చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో వేంచేసియున్న బగళాముఖి అమ్మవారికి సోమవారం వరుణ కలశాభిషేక మహోత్సవం వైభవంగా నిర్వహించారు. వరుణుని అనుగ్రహంతో వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ భక్తులు బగళాముఖి అమ్మవారికి వరుణ కలశాభిషేకం, పూజలు చేశారు. తొలుత 108 లీటర్ల ఆవుపాలు, ఆవు పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, సుగంథ ద్రవ్యాలు, పసుపు, కుంకుమలతో అమ్మవారికి అభిషేకాలు చేశారు. పవిత్ర జలాలు తీసుకువచ్చి కలశాలలో నింపి భక్తులు శిరస్సుపై ధరించి శోభాయమానంగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. వేద పండితులు ధర్మకర్తల మండలి సభ్యులు భక్తుల సమక్షంలో అమ్మవారికి సమర్పించారు. తొలుత ఆలయ ట్రస్ట్బోర్డు చైర్మన్ కలకోట చక్రధర్రెడ్డి దంపతులు గణపతి పూజ చేసి అమ్మవారికి పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. వరుణ కలశాభిషేక అనంతరం అమ్మవారికి శీతల పరమేశ్వరి దివ్య అలంకరణ చేశారు. కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు.
నరసరావుపేట టౌన్: మండలంలోని రావిపాడు గ్రామంలో సోమవారం మధ్యవర్తిత్వంపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయ అధికారి జి.కల్యాణ చక్రవర్తి ఆదేశాలతో న్యాయాధికారి జియావుద్దీన్ న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సమాజంలోని వ్యక్తులు, సమూహాల మధ్య వచ్చే చిన్నపాటి వివాదాలపై న్యాయస్థానాలకు వెళ్లకుండా శాంతియుతంగా రాజీమార్గంలో పరిష్కరించే ఒక ప్రక్రియ అన్నారు. శిక్షణ పొందిన మధ్యవర్తులు ఇరువర్గాల వారితో మాట్లాడి వారి పరస్పర అంగీకారంతో సమస్యను పరిష్కరిస్తారన్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ కిషోర్, కమ్యూనిటీ మీడియేటర్లు, స్థానిక ప్రజలు, రెవెన్యూ, పోలీస్, న్యాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
తెనాలిరూరల్: వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని జరుపుకునే తెలుగు భాషా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా తెనాలిలోని ప్రధాన పౌర కనిష్ఠ న్యాయస్థానం ద్వారా తుది తీర్పులను తెలుగు భాషలో వెలువరించేందుకు వారం రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాన్ని న్యాయమూర్తి పవన్కుమార్ ఏకా సోమవారం ప్రారంభించారు. అందులో భాగంగా మూడు పౌర దావాలలో తీర్పులు తెలుగులోనే చెప్పినట్టు తెలిపారు.


