ఇంకొల్లు(చినగంజాం): తప్పిపోయిన బాలుడిని పోలీసులు సాంకేతిక సాయంతో చాకచక్యంగా పట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించారు. సోమవారం ఇంకొల్లు ఎస్ఐ జీ సురేష్ మాట్లాడుతూ.. ఇంకొల్లు మండలంలోని సూదివారిపాలెం గ్రామానికి చెందిన పాలపర్తి నాగచైతన్య అనే 17 ఏళ్ల బాలుడు ఈ నెల 22న తేదీ శనివారం ఉదయం కాలేజీకి వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరాడు. మార్గమధ్యంలో పూసపాడు క్రాస్ రోడ్డు వద్ద బస్సుదిగి అనంతరం కనిపించకుండా పోయాడు. బాలుడు కాలేజీకి వెళ్లి ఇంటికి తిరిగిరాక పోవడంతో కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలోను పరిసర ప్రాంతాల్లోను గాలించినప్పటికి ఆచూకీ లభించలేదు. దాంతో తల్లి పాలపర్తి నాగమణి 23 వతేదీ ఆదివారం పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. పోలీసుల గాలింపులో సీసీటీవీ 360 ప్రాజెక్ట్ ద్వారా బాలుడి కదలికలను ప్రతి రెండు గంటలకు ఒకసారి సాంకేతికంగా పరిశీలించారు. 23 వతేదీ సాయంత్రం నిర్వహించిన పరిశీలనలో సాయంత్రం 6.50 గంటలకు బాలుడు ఒంగోలు బస్టాండ్ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల్లో గుర్తించబడ్డాడు. వెంటనే ఇంకొల్లు పోలీస్ స్టేషన్ సిబ్బంది అక్కడికి చేరుకొని బాలుడిని క్షేమంగా గుర్తించి తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సీసీటీవీ 360 ప్రాజెక్ట్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తక్కువ సమయంలో బాలుడ్ని గుర్తించడం సాధ్యమైందని ఎస్ఐ తెలిపారు.
గుంటూరు జిల్లాలో సగటు వర్షపాతం 7.8 మి.మీటర్లు
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 13 మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా చేబ్రోలు మండలంలో 26.4 మిల్లీ మీటర్లు వర్షం కురవగా, అత్యల్పంగా ఫిరంగిపురం మండలంలో 1.8 మి.మీ వర్షం కురిసింది. సగటున 7.8 మి.మీ వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. పెదకాకాని మండలంలో 20.4 మి.మీ., దుగ్గిరాల 18.4, తెనాలి 17.6, పెదనందిపాడు 10.2, కొల్లిపర 8.8, కాకుమాను 8.6, వట్టిచెరుకూరు 7.2, పొన్నూరు 6.4, గుంటూరు తూర్పు 6.4, గుంటూరు పశ్చిమ 5.4, ప్రత్తిపాడు మండలంలో 2.8 మి.మీ చొప్పున వర్షం పడింది.


