వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు డి.రమాదేవి కలెక్టరేట్ ఎదుట ధర్నా
బాపట్ల: రాష్ట్రవ్యాప్తంగా దళితులు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలు పరిష్కరించాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి.రమాదేవి విమర్శించారు. దళితవాడల్లో సమస్యల పరిష్కారం కోసం వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ధర్నాకు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి టి.కృష్ణమోహన్ అధ్యక్షత వహించారు. రమాదేవి మాట్లాడుతూ దళితవాడల్లోని ప్రజలకు కనీసం తాగేందుకు నీళ్లు ఇవ్వలేకపోవడం, జీవో నెంబర్ 1235 ప్రకారం ప్రతి దళిత గ్రామానికి రెండు ఎకరాలు శ్మశానస్థలం కేటాయించాల్సి ఉందని కానీ ఆ పరిస్థితి లేదన్నారు. బాపట్ల జిల్లాలో అనేక ఏళ్లుగా దళితులు సాగు చేసుకుంటున్న సొసైటీ, పోరంబోకు, లంక భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితులు సాగు చేస్తున్న భూములకు తక్షణమే ఎరువు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ కార్మికులు చేసిన ఉపాధి పనికి డబ్బులు మూడు వారాలుగా బకాయి ఉన్నాయని, వాటిని తక్షణమే చెల్లించాలని కోరారు. కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్.గంగయ్య మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు సమస్యలు పరిష్కరించకుండా మోసం చేస్తున్నారని అన్నారు. ధర్నా శిబిరం వద్దకు వచ్చిన జిల్లా కలెక్టర్ వినోద్కుమార్కు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. సమస్యలను పరిష్కారం చేస్తామని జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ధర్నాలో కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ నాయకులు జయరాజు, ఎన్.బాబురావు, సిహెచ్.మణిలాల్, పి.కొండయ్య, బి.అగస్టీన్, కే.శరత్బాబు, ఎం.కిరణ్, పి.మనోజ్, బి సుబ్బారావు, ఎం.వసంతరావు, పి. శ్రీనివాసరావు, కె.నాగేశ్వరావు, నూతలపాటి కోటేశ్వరరావు పాల్గొన్నారు.


