చిలకలూరిపేట: ప్రియురాలిని గొంతు కోసి, పెట్రోల్ పోసి తగులబెట్టి అత్యంత కిరాతకంగా హతమార్చిన నిందితుడిని చిలకలూరిపేట పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. చిలకలూరిపేట అర్బన్ పోలీస్స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నరసరావుపేట డీఎస్పీ ఎం హనుమంతరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని వైఎస్సార్ కాలనీలో నివాసం ఉండే షేక్ మస్తాన్వలి కుమార్తె షేక్ హసీనా(23) అలియాస్ యాస్మిన్ బోయపాలెం సమీపంలోని మిట్టపల్లి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసుకుంది. సూళ్లూరుపేటలో ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. ఈనెల నాల్గవ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన కుమార్తె కనిపించటం లేదని హసీనా తండ్రి మస్తాన్వలి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు విచారణలో గుంటూరులోని చలపతి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతూ మధ్యలో చదువును నిలిపివేసిన కారంపూడి మండలం ఇనుపరాజుపల్లి గ్రామానికి చెందిన జినుగు బాలసైదులతో నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు తెలుసుకున్నారు. మృతురాలు ఇటీవల కాలంలో నిందితుడితో తక్కువగా మాట్లాడుతుండం వలన, ఆమె వేరే వ్యక్తితో పరిచయం పెంచుకొని నిందితుడిని దూరంగా పెడుతున్నదని అనుమానం పెంచుకున్నాడు. అనుమానం ముదిరి ఆమెను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకొని ఈనెల 4వ తేదీన మృతురాలికి మాయమాటలు చెప్పి నమ్మించి కారంపూడి పిలిపించుకున్నాడు. కారంపూడి నుంచి నకరికల్లు వెళ్లే రోడ్డులో ఎన్ఎస్పీ కెనాల్ పడమరకట్ట టర్నింగ్ వద్ద నిర్మానుష్య ప్రదేశానికి హసీనాను తీసుకువెళ్లాడు. ముందుగానే తన వెంట తెచ్చుకున్న కూరగాయలు కోసే చాకుతో హసీనాను మూడు పోట్లు పాడవగా విపరీతమైన రక్తస్రావంతో చనిపోయింది. చనిపోయాక ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా చేసే ఉద్దేశంతో బైక్ ట్యాంకులో ఉన్న పెట్రోల్ను ఖాళీ వాటర్ బాటిల్తో నింపి, మృతురాలిపై పోసి దహనం చేసి పరారయ్యాడు.
ఈ విషయమై రెండు బృంధాలుగా ఏర్పడిన పట్టణ పోలీసులు సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితుడిని కారంపూడి పాత సినిమాహాల్ సెంటర్లో శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో ఆమె గతంలోలా తనతో ఫోన్లో సంభాషించకపోవడంతో తనకు దక్కని ఆమె వేరొకరికి దక్కడానికి వీలు లేదని హతమార్చినట్లు తెలిపాడు. ఈ విషయమై ఇతనికి ఎవరైనా సహకరించారా అనే విషయాలు రాబట్టేందుకు పోలీసు కస్టడీకి న్యాయస్థానంలో కోరనున్నట్లు వెల్లడించారు. ఫిర్యాదు అందిన వెంటనే సకాలంలో స్పందించి కేసు చేధించిన అర్బన్ సీఐ పి రమేష్, పట్టణ ఎస్ఐలు వి సోమేశ్వరరావు, పి హజరతయ్య, సిబ్బందిని డీఎస్పీ అభినందనలు తెలిపారు.
అనుమానంతోనే హత్యచేసినట్లు
ప్రాఽథమిక దర్యాప్తులో వెల్లడి


