గాలివీడు : వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక చవితి సందర్భంగా గణనాధుల నిమజ్జనం నిషేధించబడిందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని గణేష్ కమిటీ సభ్యులు తెలుసుకొని సహకరించాలని వారు కోరారు.
15 లోపు అభ్యంతరాలు
తెలియజేయాలి
మదనపల్లె సిటీ : జిల్లాలో కేజీబీవీలలో ఖాళీగా ఉన్న బోధన సిబ్బంది మెరిట్ జాబితాను సమగ్ర శిక్ష వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ అనూరాధ తెలిపారు. అభ్యర్థులు తమ వివరాలను పరిశీలించుకుని, ఏవైనా అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉన్నట్లయితే తగిన ఆధారాలతో 15వతేదీ సాయంత్రం 5 గంటలలోపు ఏపీసీ కార్యాలయంలో లిఖిత పూర్వకంగా సమర్పించాలన్నారు. నిర్టిష్ట గడువు అనంతరం అందే ఎటువంటి అభ్యంతరాలు,ఫిర్యాదులు పరిశీలనకు స్వీకరించరని తెలిపారు.మరిన్ని వివరాలకు 7989974663, 8688618382 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులు తొలగిస్తాం
పీలేరురూరల్ : జిల్లాలో 15 సంవత్సరాలు పైబడిన కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులు 83 ఉన్నాయని, వాటిని తొలగిస్తామని డీపీటీవో ఎం. శశిభూషణ్ అన్నారు. శనివారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్, గ్యారేజ్, పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ కాలం చెల్లిన బస్సులను వచ్చే ఏడాది మార్చి ఆఖరులోపు తొలగిస్తామన్నారు. పీలేరు డిపోలో 28 బస్సులు తొలగిస్తామని చెప్పారు. జిల్లాలో రోజుకు 499 సర్వీసులు 1.82 కిలోమీటర్లు నడిపి ఆదాయం రూ. 89.97 లక్షలు వస్తున్నట్లు తెలిపారు.ఆగస్టు వరకు ఆర్టీసీలో ప్రమాదాల సంఖ్య 0.05 ఉందని చెప్పారు. ఆర్టీసీ బస్టాండులో వస్తువులు ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలన్నారు. కార్యక్రమంలో డీఎం ఎస్ఎండి. రోషణ్, ఎంఎఫ్ ఫణిభూషణ్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
సేవలలో మొదటి స్థానం
కడప రూరల్ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు సర్వీసెస్ డెలివరీ(సేవలను ప్రజలకు అందించడం)లో రాష్ట్రస్థాయిలో జిల్లాకు మొదటి స్థానం లభించింది. ఈ ఏడాది జులైలో 81.48 శాతం, ఆగస్టు లో 81.59 శాతం సాధించి వరుసగా రెండు నెలలు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ యుగంధర్ వైద్య సిబ్బందిని అభినందించారు.
తిరుమల బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం
కడప సిటీ : తిరుమలలో ఈ నెల 15 నుంచి 23 వరకు జరిగే శ్రీవేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల వాహన సేవలకు ప్రత్యక్ష వ్యాఖ్యానం చేయాల్సిందిగా కడపకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక రచయిత, ప్రవచనకర్త డాక్టర్ ఐఎల్ఎన్ చంద్రశేఖరరావుకు టీటీడీ అధికారులు ఆహ్వానం పంపారు.పెండ్లిమర్రి ఆదర్శ ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్ర అధ్యాపకుడైన ఆయన, ఈ నెల 15న పెద్దశేష వాహనం, 16న చిన్నశేష వాహన సేవలకు మాడ వీధుల్లో టీటీడీ ధర్మప్రచార పరిషత్ తరఫున వ్యాఖ్యానం చేయనున్నారు. అలాగే 21న జరిగే స్నపన తిరుమంజనం, చంద్రప్రభ వాహన సేవలకు ఎస్వీబీసీ ఛానల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానం అందించనున్నారు.
గల్ఫ్ కార్మికుల
సహాయ కేంద్రం ప్రారంభం
కడప కార్పొరేషన్ : జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి గల్ఫ్ కార్మికుల సహాయ కేంద్రం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుందని కడప వన్టౌన్ సీఐ తిమ్మారెడ్డి తెలిపారు. శనివారం కడపలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల హీరో షోరూం ఆవరణలో ఏర్పాటు చేసిన గల్ఫ్ కార్మికుల సహాయ కేంద్రాన్ని ఆయన ఇతర అతిథులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. అవగాహన లేక ఏజెంట్ల చేతిలో మోసపోతున్న వారిని రక్షించేందుకు, సురక్షిత వలసలను ప్రోత్సహించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు.


