సదుం: జీవనోపాధి కోసం పనులకు వచ్చిన కూలీ విద్యుదాఘాతంతో మృతి చెందాడు. పుంగనూరు రూరల్ సీఐ సాయిప్రసాద్ కథనం మేరకు..మండలంలో గత కొద్ది రోజులుగా గ్రామాలకు త్రీఫేజ్ సరఫరా చేసేలా నూతన విద్యుత్ లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందు కోసం బెంగాల్కు చెందిన కొందరు కూలీపనులకు వచ్చారు. గొంగివారిపల్లె వద్ద పనులు చేపడుతుండగా అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కావడంతో తఫీజుల్ (26) షాక్కు గురయ్యాడు. అతన్ని తిరుపతికి తరలిస్తుండగా ఆదివారం రాత్రి మార్గమధ్యంలో మృతి చెందాడు.
మహిళ అదృశ్యం
మదనపల్లె టౌన్: మహిళ అదృశ్యంపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ కళా వెంకటరమణ కథనం మేరకు.. మదనపల్లె మండలం చిప్పిలికి చెందిన జంగాల దేవేంద్ర భార్య జంగాల సుకన్య బజారుకు వెళుతున్నానని చెప్పి నాలుగు రోజుల క్రితం వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబీకులు పలుచోట్ల గాలించినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పిల్లలు పుట్టలేదని ఆత్మహత్య
రొంపిచెర్ల: పిల్లలు పుట్టలేదని మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన రొంపిచెర్ల గ్రామ పంచాయతీలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఇందిరమ్మ కాలనికి చెందిన మల్లెల ముస్కాన్(26) అజంతుల్లాకు 8 ఏళ్ల కిందట వివాహం జరిగింది. అయితే వారికి పిల్లలు పుట్టలేదు. ఈ విషయమై మానసిక వేదనతో ఆదివారం రాత్రి ఇంట్లో భర్త లేని సమయలో ఫ్యాన్కు ఉరి వేసుకుంది. కుటుంబ సభ్యులు రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మధుసూధన్ సోమవారం తెలిపారు.


