మదనపల్లె సిటీ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 24న మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ (మెగా పీటీఎం 3.1) కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ డాక్టర్ అనురాధ తెలిపారు. జిల్లాలోని 1785 ప్రభుత్వ, 7 ఎయిడెడ్ పాఠశాలల్లో జరుగుతుందన్నారు. సమావేశంలో విద్యార్థుల విద్యా ప్రగతి, హోలిస్టిక్ ప్రొగ్రెస్ కార్డు, లీప్యాప్ ద్వారా విద్యార్థుల అభ్యసన స్థాయి, ఫౌండేషన్ లిటరసీ దీక్షా యాప్ వినియోగం, పాఠశాలల్లో అమలవుతున్న వివిధ విద్యా సంస్కరణలపై తల్లిదండ్రులతో సమగ్ర అవగాహన కల్పించబడుతుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి మెగా పీటీఎం కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.
పీలేరు పంచాయతీకి
ఐఎస్ఓ గుర్తింపు
పీలేరు : జిల్లాలో పీలేరు పంచాయతీకి ఐఎస్ఓ గుర్తింపు లభించింది. సోమవారం కలెక్టర్ నిశాంత్కుమార్ మదనపల్లె కలెక్టరేట్ కార్యాలయంలో పీలేరు గ్రామ పంచాయతీ ఈవో రవీంద్రరెడ్డి, ప్రత్యేకాధికారి యుగంధర్లకు ఐఎస్ఓ సర్టిఫికెట్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోనే ఐఎస్ఓ గుర్తింపు పొందిన తొలి పంచాయతీగా పీలేరు మేజర్ పంచాయతీ నిలిచిందని అభినందించారు.
ఇకపై యాప్లోనే లావాదేవీలు
సాక్షి, మదనపల్లె : స్వయం సహాయక సంఘాల సభ్యులకు మన డబ్బులు–మన లెక్కలు యాప్ వినియోగంపై మెప్మా ఆధ్వర్యంలో సోమవారం మదనపల్లెలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా టీఈఐబీ నాగరాజు, టీఈ సీయంయం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ యాప్ ద్వారా సంఘ సభ్యులు తమ పొదుపులు, రుణాలు, చెల్లించిన, చెల్లించాల్సిన వాయిదాల వివరాలను సులభంగా తెలుసుకోవచ్చన్నారు. మెప్మా కార్యక్రమాలు, జీవనోపాధి అవకాశాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా యాప్ ద్వారా పొందవచ్చని తెలిపారు. యాప్లోని మొబైల్ బుక్ కీపింగ్ విధానాన్ని ఉపయోగించి సంఘాల ఆర్థిక లావాదేవీలన్నింటినీ తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. వచ్చే నవంబర్నాటికి స్వయం సహాయక సంఘాల సభ్యులందరూ తమ ఆర్థిక లెక్కలను యాప్లో స్వయంగా చూసుకునే స్థాయికి చేరేలా అవగాహన పెంచుకోవాలని కోరారు. ఈ శిక్షణలో సంఘ సభ్యులకు యాప్ వినియోగం, మొబైల్ బుక్ కీపింగ్, ఆర్థిక లావాదేవీల నమోదు తదితర అంశాలపై అవగాహాన కల్పించారు. సీఓలు అనిత, నాగేంద్ర, ఆర్పి పుష్ప, సంఘ సభ్యులు హాజరయ్యారు.
ప్రభుత్వ భూముల పరిశీలన
రామసముద్రం : జిల్లాలో హార్టికల్చర్ హబ్ ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ భూములను గుర్తించే ప్రక్రియలో భాగంగా కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమవారం రామసముద్రం మండలంలోని చొక్కాండ్లపల్లి గ్రామ సమీపంలో ఉన్న 60 ఎకరాల ప్రభుత్వ పశువుల మేత బీడు భూమిని పరిశీలించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణితో కలిసి సర్వే నంబర్ 177లోని భూమిని సందర్శించి, హార్టికల్చర్ హబ్ ఏర్పాటుకు అనుకూలతపై అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మదనపల్లె నియోజకవర్గ పరిధిలోని అనువైన ప్రభుత్వ భూములను గుర్తిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ సందర్భంగా భూమి విస్తీర్ణం, భౌగోళిక పరిస్థితులు, రహదారి అనుసంధానం, సరిహద్దులు, నీటి వనరులు, విద్యుత్ సౌకర్యం, ఇతర మౌలిక సదుపాయాలపై రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. హార్టికల్చర్ హబ్ ఏర్పాటు ద్వారా ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహం లభించడంతో పాటు, పంటల నిల్వ, ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపడే అవకాశం ఉందన్నారు. ఈ పరిశీలనలో తహసీల్దార్ అజారుద్దీన్, సర్వేయర్ నరేంద్ర, రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.


