సాక్షి, మదనపల్లె : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకే షైనింగ్ స్టార్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా ఇన్చార్జ్ మంత్రి బీసీ.జనార్దనరెడ్డి అన్నారు. సోమవారం ఆయన మదనపల్లెలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాలో పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన 157 మంది, ఇంటర్మీడియట్లో ప్రతిభ కనబరిచిన 31 మందిని ఎంపిక చేశామన్నారు. విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున రూ.37.60 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందించామన్నారు. విద్యార్థులు తమ లక్ష్యాన్ని నిర్దేశించుకుని కలెక్టర్, డాక్టర్, ఇంజనీర్, ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నత రంగాల్లో రాణించి రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలని కోరారు. తల్లిదండ్రులు పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సెల్ఫోన్ల వినియోగాన్ని నియంత్రించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఆహార నాణ్యతపై పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎమ్మెల్యే షాజహాన్బాషా, డీఈఓ సుబ్రమణ్యం, ఏసీపీ అనురాధ పాల్గొన్నారు.
జిల్లా ఇన్చార్జ్ మంత్రి జనార్దనరెడ్డి


