మదనపల్లె (కురబలకోట): ప్రజలకు సత్వరం ప్రభుత్వ సేవలను అందించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన మీసేవ కేంద్రాలు జిల్లాలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సచివాలయాల పేరును కూటమి ప్రభుత్వం స్వర్ణ వార్డు–స్వర్ణ గ్రామంగా మార్చింది. వీటి లోగోలతో కొత్త ధ్రువీకరణ పత్రాలు సరఫరా చేయడంలో తీవ్ర జాప్యం నెలకొంది. నెలరోజులుగా రైతులు, విద్యార్థులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కులం, ఆదాయం, జనన, ఈడబ్ల్యూఎస్, జనన, మరణ, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ వంటి అత్యవసర సర్టిఫికెట్లు లేక మీసేవ నిర్వాహకులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీస్ సర్టిఫికెట్లు, వన్బీ, ఆడంగళ్లకు కూడా ఎక్కువగా రైతులు వీటిపై ఆధారపడతారు. ప్రింటింగ్ ధ్రువీకరణ పత్రాలు లేక అవస్థలు పడుతున్నారు. జిల్లాలో 89 మీసేవ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి రోజు వివిధ ప్రాంతాల వారు వీటిని ఆశ్రయిస్తారు. వీరికి ఇవ్వడానికి ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో మీసేవ కేంద్రాలు వెలవెలబోతున్నాయి. కొందరికి రెండు నెలలుగా, మరికొందరికి నెలరోజులుగా వీటిని ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఇంత అధ్వాన పరిిస్థితి గతంలో ఎన్నడూ చూడలేదని మీ సేవ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికంగా కూడా నష్టపోతున్నామని వీటి కోసం డబ్బులు చెల్లించినా ఇంత వరకు రాకపోవడంతో వినియోగదారులకు సమాధానం చెప్పలేకపోతున్నట్లు వ్యధ చెందుతున్నారు.
సచివాలయాల్లో కూడా కొరతే...
జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా ధ్రువీకరణ పత్రాల కొరత వెంటాడుతోంది. అరకొరగానే వీటిని ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఈ విషయమై జిల్లా మేనేజర్ నరేంద్రను విచారించగా జూన్ పది నుంచి పాత సర్టిఫికెట్లను వినియోగించరాదని ఆదేశాలు వచ్చాయన్నారు. దీంతో స్వర్ణ గ్రామ–స్వర్ణ వార్డు సచివాలయాల పేరిట కొత్తవి ప్రింట్ చేయడంలో కొంత జాప్యం జరిగిందన్నారు. ఇప్పటికే వీటిని కొందరికి పంపిణీ చేయడం జరిగిందని మిగిలిన వారికి కూడా త్వరలో అందజేస్తున్నట్లు తెలిపారు.
సచివాలయాలనూ వెంటాడుతున్న కొరత
కొత్త ధ్రువీకరణ పత్రాల కోసం ఎదురు చూపు


