రాయచోటి టౌన్ : టెండర్ల ద్వారా దక్కించుకున్న పనుల్లో నాణ్యత పాటించకుంటే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా టెండర్లు రద్దు చేస్తామని రాయచోటి శ్రీ వీరభద్ర స్వామి పాలక మండలి అధ్యక్షులు తిరుమల మనోజ్ కుమార్ హెచ్చరించారు. బుధవారం శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో పలు రకాల అభివృద్ధి పనులకు టెండర్లు నిర్వహించారు. స్వామి వారికి ఒక లడ్డూ, రెండు లడ్డూల బాక్స్లు, లడ్డూల కవర్లకు సంబంధించిన వాటికి టెండర్లు నిర్వహించారు. ఈ టెండర్లలో మొత్తం 32 మంది పాల్గొన్నారు. ఆలయ నిబంధనల ప్రకారం తక్కువ ధరలకు (ఎల్1) కోట్ చేసిన టెండర్లు ఖరారు చేస్తామని చెప్పారు. కవర్లు, బాక్స్లకు ఆలయం పేరు కూడా మద్రించాలని సూచించారు. అలాగే ఆలయంలో 42 సీసీ కెమెరాల స్థానంలో 5 ఎంపీ, 8 ఎంపీ ఐపీ కెమెరాలు, ఎన్వీఆర్, ఎస్ఎస్డీ హార్డ్ డిస్క్ల ఇన్స్టాలేషన్, అదనంగా మరో 16 సీసీ కెమెరాల ఏర్పాటుకు కూడా టెండర్లు నిర్వహించారు. వీటిలో కూడా తక్కువ కోట్ చేసిన వారికి ఈ టెండర్ అప్పగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో దేవాదాయ, ధర్మాదాయశాఖ జూనియర్ అసిస్టెంట్ ఇంద్ర, పాలక మండలి సభ్యులు గిరి, ఇతరా సభ్యులు పాల్గొన్నారు.


