మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మంగళవారం మదనపల్లె పట్టణంలో ఆకస్మికంగా పర్యటించారు. ట్రాఫిక్ పోలీసులతో కలసి ట్రాఫిక్ పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ఎస్పీ బీసెంట్ సర్కిల్ నుంచి సంఘం ఫంక్షన్ హాల్ వరకు కాలినడకన వెళ్తూ రోడ్లపై నెలకొన్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. రోడ్లకు ఇరువైపులా దుకాణదారులు చేపట్టిన ఆక్రమణలు, రోడ్డుపైనే తోపుడు బండ్లు ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతోందని ఎస్పీ గుర్తించారు. వెంటనే వాటిని తొలగించుకోవాలని వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి మళ్లీ ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.


