– యువకుడికి తీవ్ర గాయాలు
మదనపల్లె టౌన్ : బాత్రూంలో లైట్ వేస్తుండగా కరెంట్ షాక్కు గురై ఓ యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన మంగళవారం ఉదయం వాల్మీకిపురంలో చోటుచేసుకుంది. బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తేరువీధిలో నివాసం ఉంటున్న లక్ష్మీప్రసాద్(23) ఉదయం బాత్రూంలో లైట్ వేసేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాధితున్ని వాల్మీకిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
టమాటాల ట్రాక్టర్ బోల్తా
పుంగనూరు : పట్టణంలోని మినీ బైపాస్ రోడ్డులో మంగళవారం ఉదయం టమాటాలను తీసుకుని ట్రాక్టర్లో మార్కెట్యార్డుకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. అక్కడ ఉన్న మలుపులో ట్రాక్టర్ను డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోవడంతో ట్రాక్టర్ బోల్తా కొట్టింది. దీంతో టమాటాలు అన్నీ కింద పడిపోయాయి. అసలే ధరలు లేక విలవిలలాడుతున్న రైతుకు తీరని నష్టం కలిగింది. అదృష్టవశాత్తు ఆ ప్రాంతంలో ప్రజలు ఎవరు రాకపోవడంతో ప్రమాదం తప్పింది.
బస్సు కింద పడి
విద్యార్థిని మృతి
పీలేరు రూరల్ : ఆర్టీసీ బస్సు కింద పడి ఓ విద్యార్థిని మృతి చెందిన సంఘటన పీలేరు పట్టణం పాతబస్టాండులో చోటు చేసుకుంది. వివరాలిలా వున్నాయి. పీలేరు పట్టణంలోని అయ్యప్పరెడ్డి కాలనీలో నివాసముంటున్న ముక్తియార్ అహ్మద్ కుమార్తె హసిన్తాజ్(17) ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఎంసెట్ కౌన్సెలింగ్కు సిద్ధంగా ఉంది. స్థానిక ఉర్దూ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న తల్లి రమీమున్నీషాను స్కూల్ సమయం అనంతరం తీసుకురావడానికి మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి ద్విచక్రవాహనంలో బయలుదేరింది. పాతబస్టాండులో సదుం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రయాణికులను ఎక్కించుకుని బయలుదేరే సమయంలో.. బస్సు పక్కగా వచ్చిన హసిన్తాజ్ ద్విచక్రవాహనం అదుపుతప్పింది. ఈ ఘటనలో ఆమె కిందపడిపోయింది. అదే సమయంలో బస్సు ముందు చక్రం ఆమెకు తాకింది. హసిన్తాజ్ను చికిత్స నిమిత్తం స్థానిక ఏరియాఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
జమ్మలమడుగు రూరల్ : మండలంలోని మోరగుడి గ్రామానికి చెందిన దినకర్ మరో విద్యార్థి ప్రసాద్ స్నేహితులు. వీరు జమ్మలమడుగు పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. సోమవారం పాఠశాలకు వెలుతున్నామని చెప్పిన వీరు పాఠశాలకు వెళ్లకుండా సోమవారం సాయంత్రం కూడా ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు మంగళవారం పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.


