– జస్టిస్ గోపాల్ గౌడ
బి.కొత్తకోట: విజయనగర సామ్రాజ్య సామంతరాజు, బెంగళూరు మహానగర నిర్మాత నాడప్రభు కెంపేగౌడ అసాధారణ పోరాట పటిమ గల గొప్ప నాయకుడని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాల్ గౌడ కొనియాడారు. బి.కొత్తకోటలో మొరుసుకాపు రెడ్డి (వక్కలిగర) సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కెంపేగౌడ 517వ జయంతి వేడుకల ఆత్మీయ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ గోపాల్ గౌడ మాట్లాడుతూ.. బెంగళూరు నగర అభివృద్ధికి కెంపేగౌడ చేసిన అపార కృషి, సేవలు చరిత్రలో వెలకట్టలేనివన్నారు. ఇదే తరుణంలో దేశానికి వెన్నెముక అయిన రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉన్నా, వారిని ఆదుకునే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపకపోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సభకు ముందుగా వక్కలిగర సంఘం నాయకుల ఆధ్వర్యంలో కెంపేగౌడ చిత్రపటాన్ని ప్రదర్శిస్తూ పురవీధుల్లో భారీ ఊరేగింపు నిర్వహించారు. పీటీఎం రోడ్డు నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన దిగువ బస్టాండ్ మీదుగా బెంగళూరు రోడ్డు వరకు కొనసాగింది. సభలో పాల్గొన్న కర్నాటక శ్రీనివాసపురం ఎమ్మెల్యే జీకే వెంకటశివారెడ్డి మాట్లాడుతూ.. ఏడాది కాలంలోపు మొరుసు కాపుల సంఘం ఆధ్వర్యంలో బృహత్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుడతామని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కర్నాటక వక్కలిగర సంఘం ప్రధాన కార్యదర్శి కోనపరెడ్డి మాట్లాడారు. ఈ నెల 17న వి.కోటలో నిర్వహించబోయే నాడప్రభు కెంపేగౌడ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మొరుసు కాపు కుటుంబ సభ్యులందరూ తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.


